Begin typing your search above and press return to search.

టోక్యో ఒలింపిక్స్‌ : ఆరో రోజు హైలెట్స్ .. మేరీకోమ్‌ అవుట్ !

By:  Tupaki Desk   |   30 July 2021 4:22 AM GMT
టోక్యో ఒలింపిక్స్‌ : ఆరో రోజు హైలెట్స్ .. మేరీకోమ్‌ అవుట్ !
X
టోక్యో ఒలింపిక్స్‌లో రోజులు గడుస్తున్న కొద్దీ భారత అథ్లెట్లు ఒక్కొక్కరుగా ఉత్త చేతులతో వెనుదిరుగుతున్నారు. తొలి రోజే మీరాబాయి చాను సిల్వర్‌తో మెరవడం తప్ప తర్వాతి ఐదు రోజులూ భారత్‌ కు నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. అయితే ఆరో రోజైన గురువారం పతకం రాకపోయినా ఆశజనక ఫలితాలు వచ్చాయి. గోల్డ్ మెడల్ టార్గెట్‌ గా బరిలోకి దిగిన తెలుగు తేజం పీవీ సింధు..క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా.. భారత పురుషుల హాకీ టీమ్ సైతం క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. బాక్సర్ సతీశ్ కుమార్ సూపర్ పంచ్‌ తో అదరగొట్టాడు. ఆర్చరీలో అతాను దాస్ ప్రిక్వార్టర్స్ చేరి ఆశలు రేపాడు. షూటింగ్‌ లో మనుభాకర్ అదరగొట్టగా.. రోయింగ్, సెయిలింగ్‌ లో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ ముందుంజ వేయలేకపోయారు. అయితే ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ తన పోరాటాన్ని ప్రీక్వార్టర్స్‌ లోనే ముగించింది.

ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌, ఐదుసార్లు ఆసియా క్రీడల విజేత మాంగ్టే చుంగ్నీజాంగ్‌ మేరీ కోమ్‌ ఒలింపిక్‌ పోరాటం ముగిసింది. టోక్యోలో పసిడి పతకం పట్టడమే పరమావధిగా బరిలోకి దిగిన మేరీ.. గురువారం జరిగిన మహిళల 51 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లో 2-3తో ఇన్‌గ్రిట్‌ లొరేనా వలెన్సియా (కొలంబియా) చేతిలో ఓటమి పాలైంది. మూడు రౌండ్‌ల పోరులో తొలి రౌండ్‌ మినహా.. మిగిలిన రౌండ్‌లలో మేరీ ఆధిపత్యం ప్రదర్శించినా.. చివరకు న్యాయ నిర్ణేతలు వలెన్సియాను విజేతగా ప్రకటించారు. టీమ్‌ ఈవెంట్‌ లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత ఆర్చర్లు.. వ్యక్తిగత విభాగాల్లో సత్తాచాటుతున్నారు.

మహిళల విభాగం నుంచి ప్రపంచ నంబర్‌వన్‌ దీపికా కుమారి ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరగా.. పురుషుల విభాగంలో ఆమె భర్త అతాను దాస్‌ కూడా క్వార్టర్స్‌ లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన కీలక పోరులో అతాను దాస్‌.. రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ ఓహ్‌ జిన్‌ హైక్‌ (కొరియా)పై 6-5తో విజయం సాధించడం విశేషం.

25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల క్వాలిఫికేషన్‌ ఈవెంట్‌ లో భారత్‌ నుంచి మనూబాకర్‌ 292 పాయింట్లతో 5వ స్థానంలో.. రాహి సర్ణోబత్‌ 287 పాయింట్లతో 25వ ప్లేస్‌ లో నిలిచింది. ఈ విభాగంలో శుక్రవారం ర్యాపిడ్‌ రౌండ్‌ జరుగనుంది.

పురుషుల 100 మీటర్ల బటర్‌ ఫ్లై ఈవెంట్‌ లో భారత స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ సెమీఫైనల్‌ కు అర్హత సాధించలేకపోయాడు. సెమీస్‌ క్వాలిఫికేషన్‌ టైమింగ్‌ 51.74 సెకన్లు కాగా.. సజన్‌ 53.45 సెకన్లతో గమ్యాన్ని చేరాడు. గోల్ఫ్‌ వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే తొలి రౌండ్‌లో అనిర్బన్‌ 8వ స్థానంలో నిలువగా , ఉదయన్‌ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు.

పురుషుల విభాగంలో భారత్‌ తరఫున హెవీ వెయిట్‌ (ప్లస్‌ 91 కేజీలు) ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన తొలి బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ క్వార్టర్స్‌ లో అడుగుపెట్టాడు. మొదటి రౌండ్‌ లో 32 ఏండ్ల సతీశ్‌ 4-1తో రికార్డో బ్రౌన్‌ (జమైకా)పై విజయం సాధించాడు. కెరీర్‌ తొలినాళ్లలో కబడ్డీపై మక్కువ చూపిన సతీశ్‌ భారత ఆర్మీలో చేరాక కోచ్‌ల సాయంతో బాక్సింగ్‌ వైపు మళ్లాడు. క్వార్టర్స్‌ లో ఉజ్బెకిస్థాన్‌ కు చెందిన బఖోదిర్‌ జలోవ్‌ తో సతీశ్‌ తలపడనున్నాడు. ఈ బౌట్‌లో విజయం సాధిస్తే.. సతీశ్‌ కు పతకం ఖాయం కానుంది.

భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ కు దూసుకెళ్లింది. గురువారం పూల్‌-ఏ మ్యాచ్‌ లో మన్‌ ప్రీత్‌ సింగ్‌ సేన 3-1తో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాపై విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఆకట్టుకున్న భారత ఆటగాళ్లు, మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రెండు గోల్స్‌ కొట్టడం విశేషం. భారత్‌ తరఫున వరుణ్‌ (43వ నిమిషంలో), వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (58వ ని), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (59వ ని) ఒక్కో గోల్‌ చేశారు. పూల్‌-ఏ లో మూడు విజయాలు ఒక ఓటమితో రెండో స్థానంలో ఉన్న భారత్‌, శుక్రవారం చివరి లీగ్‌ మ్యాచ్‌ లో జపాన్‌ తో తలపడనుంది.

టోక్యో విశ్వక్రీడల్లో పసిడి పతకం పట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు.. అంచనాలకు తగ్గట్లే క్వార్టర్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-15, 21-13తో మియా బ్లిచ్‌ ఫెల్డ్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందింది. 41 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌ లలో మ్యాచ్‌ ను ముగించింది. రియో (2016) ఒలింపిక్స్‌ లో రజతం నెగ్గిన సింధు. శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్‌ లో అకానె యమగుచి (జపాన్‌) తో తలపడనుంది. యమగుచితో ముఖాముఖిలో 11-7తో ముందంజలో ఉన్న సింధు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ షిప్‌ లోనూ ఆమెను చిత్తుచేసింది.

రోయింగ్‌ పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ లో భారత జోడీ అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌ 11వ స్థానంతో సరిపెట్టుకుంది. విశ్వక్రీడల్లో భారత్‌ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. గురువారం జరిగిన పోటీలో భారత ద్వయం 6 నిమిషాల 29.66 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. సెయిలింగ్‌ పురుషుల స్కిఫ్‌ ఈవెంట్‌ లో భారత జంట కేసీ గణపతి-వరుణ్‌ ఠక్కర్‌ 17వ ప్లేస్‌ లో నిలిచింది. మహిళల విభాగంలో నేత్ర 31, పురుషుల విభాగంలో విష్ణు 23వ స్థానాల్లో నిలిచారు.

ఇక శుక్రవారం హైలెట్స్ విషయానికొస్తే ....

ఆర్చ‌రీ వ్యక్తిగ‌త రిక‌ర్వ్ విభాగంలో దూసుకెళ్తోంది ఇండియ‌న్ ఆర్చ‌ర్ దీపికా కుమారి. శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్‌ లో ర‌ష్యా ఆర్చ‌ర్ కేనియా పెరోవా పై 6-5 తేడాతో విజయం సాధించింది. ఐదు సెట్లు ముగిసే స‌రికి ఇద్ద‌రు ఆర్చ‌ర్లు 5-5 స్కోరుతో స‌మంగా నిల‌వ‌డంతో షూట్ ఆఫ్‌ లో ఫ‌లితం తేల్చాల్సి వ‌చ్చింది. 28 స్కోరుతో తొలి, మూడో సెట్‌ ల‌ను దీపికా గెలిచింది. నాలుగో సెట్‌ లో ఇద్ద‌రు స్కోర్లు స‌మం కాగా.. రెండు, ఐదో సెట్‌ల‌ను రష్యా ఆర్చ‌ర్ సొంతం చేసుకుంది. దీంతో ఇద్ద‌రూ ఐదేసి పాయింట్ల‌తో స‌మంగా నిలిచారు. అయితే కీల‌క‌మైన షూట్ ఆఫ్‌లో దీపికా ప‌ర్ఫెక్ట్ 10 స్కోరు చేయ‌గా.. ప్ర‌త్య‌ర్థి 7 మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఈ విజ‌యంతో దీపికా క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఉద‌యం 11.30 గంట‌లకు కొరియాకు చెందిన సాన్ ఆన్‌తో దీపికా క్వార్ట‌ర్స్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఆమె కనీసం మ‌రో రెండు గెలిస్తే.. ఇండియాకు ఒక ప‌త‌కం ఖాయ‌మ‌వుతుంది.

ఇండియన్ షూటర్లు మ‌ను బాక‌ర్‌, రాహి స‌ర్నోబ‌త్ 25 మీట‌ర్ల పిస్ట‌ల్ ఈవెంట్‌ లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు. ఈ ఇద్ద‌రూ ఫైన‌ల్‌ కు క్వాలిఫై కాలేక‌పోయారు. గురువారం జ‌రిగిన క్వాలిఫికేష‌న్ ప్రిసిష‌న్ రౌండ్‌ లో 292 స్కోరుతో 5వ స్థానంలో నిలిచి ఆశ‌లు రేపిన మ‌ను, ర్యాపిడ్ రౌండ్‌ లో వెనుక‌బ‌డి పోయింది. రెండు క్వాలిఫికేష‌న్ రౌండ్లు (ప్రిసిష‌న్‌, ర్యాపిడ్‌) క‌లిపి ప్ర‌స్తుతం ఆమె 11వ స్థానంలో ఉంది. అయితే ఫైన‌ల్‌ కు టాప్ 8 మాత్ర‌మే క్వాలిఫై అవుతారు. మ‌రోవైపు ప్రిసిష‌న్ రౌండ్‌ లోనే తీవ్రంగా నిరాశ ప‌రిచిన రాహి స‌ర్నోబ‌త్ మొత్తం 573 స్కోరు తో ఏకంగా 32వ స్థానంలో నిలిచింది. గురువారం ప్రిసిష‌న్‌ లో 287, శుక్ర‌వారం ర్యాపిడ్ రౌండ్‌ లో 286 స్కోరు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. మ‌ను బాక‌ర్ పాల్గొన్న మూడు ఈవెంట్‌ ల‌లోనూ ఉత్త చేతుల‌తోనే ఇంటిదారి ప‌ట్టింది.

ఓలింపిక్స్‌ లో బాక్స‌ర్ లవ్లీనా చ‌రిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మ‌రో మెడ‌ల్‌ ఖాయం చేసింది. 64-69 కేజీల విభాగంలో శుక్ర‌వారం జరిగిన క్వార్ట‌ర్‌ ఫైన‌ల్ లో లవ్లీనా అద్భుత‌మైన విజ‌యం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజ‌యంతో ఆమె సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫ‌లితం తో సంబంధం లేకుండా ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం. సెమీస్‌లో ఒక‌వేళ ల‌వ్లీనా ఓడినా, బ్రాంజ్ మెడ‌ల్ మాత్రం ఖాయం. ఓలింపిక్స్‌ లో బాక్స‌ర్ లవ్లీనా చ‌రిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మ‌రో మెడ‌ల్‌ ఖాయం చేసింది. 64-69 కేజీల విభాగంలో శుక్ర‌వారం జరిగిన క్వార్ట‌ర్‌ ఫైన‌ల్లో లవ్లీనా అద్భుత‌మైన విజ‌యం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌ పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజ‌యంతో ఆమె సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫ‌లితంతో సంబంధం లేకుండా ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం. సెమీస్‌ లో ఒక‌వేళ ల‌వ్లీనా ఓడినా, బ్రాంజ్ మెడ‌ల్ మాత్రం ఖాయం.