Begin typing your search above and press return to search.

సుబ్బారెడ్డిని వ‌దిలేస్తారా? చంద్ర‌బాబు ఫైర్

By:  Tupaki Desk   |   18 March 2023 7:11 PM GMT
సుబ్బారెడ్డిని వ‌దిలేస్తారా?  చంద్ర‌బాబు ఫైర్
X
ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగిన ఈ నెల 13న స్తానికేత‌రుడైన టీటీడీ చైర్మ‌న్, వైసీపీ కీల‌క నాయ‌కుడు..వైవీ సుబ్బారెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న నేరుగా బూతుల్లోకి వెళ్లి ప్ర‌చారం చేయ‌డం.. ఓట‌ర్ల‌కు దండాలు పెట్టి మ‌రీ వైసీపీ అభ్య‌ర్థి పక్షాన ప‌రోక్షంగా ప్ర‌చారం చేయ‌డం వంటివి తీవ్ర వివాదంగా మారాయి.

దీనిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా సీరియ‌స్గా తీసుకున్నారు. వైవీపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో.. చెప్పాల‌ని.. పేర్కొంటూ ఆయ‌న ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. అయితే.. ఎన్నిక‌ల సంఘం మాత్రం.. అధికారుల‌పై చ‌ర్య‌లుతీసుకున్న‌ట్టు తెలిపింది.

కానీ, చంద్ర‌బాబు మాత్రం వైవీ విష‌యాన్ని వ‌దిలేస్తారా? అని నిప్పులు చెరిగారు. ఇదే అంశంపై మ‌రోసారి ఆయ‌న ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. వాస్త‌వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ రోజు విశాఖలో స్థానికేతరుడైన వైవి సుబ్బారెడ్డి బూత్ ల వద్ద పర్యటనపై ఎన్నికల ప్రధాన అధికారికి మూడు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దీంతో.. స్పందించిన ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి.. అప్ప‌ట్లో విధుల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్యాడ్, తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకు షో కాజ్ నోటీసులు ఇచ్చినట్లు రిప్లై లేఖలో పేర్కొన్నారు.

అయితే.. సుబ్బారెడ్డిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో చెప్పాలంటూ.. చంద్ర‌బాబు మ‌రోసారి లేఖ సంధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. పోలింగ్ రోజు అక్కయ్యపాలెం ఎన్జీఓఎస్ కాలనీ, జీవీఎంసీ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేసేలా సుబ్బారెడ్డి ప్రయత్నించారని పేర్కొన్నారు. స్థానికేతరుడు అయిన సుబ్బారెడ్డి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ పోలింగ్ బూత్‌ వద్ద నిబంధనలకు విరుద్దంగా తిరిగినా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు.

ఈ ఘ‌టనపై తాము ఫిర్యాదు చేసే వరకు అధికారులు దీనిపై స్పందించలేదని చంద్ర‌బాబు తాజా లేఖ‌లో పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి, సిటీ పోలీస్ కమిషనర్ తమ విధులను నిర్వర్తించకుండా అధికార వైఎస్సార్‌సీపీకి మొగ్గు చూపారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వైవీ సుబ్బారెడ్డి పర్యటనను ఎన్నికల అధికారులు, పోలీసులు దృవీకరించారని, ఈ కారణంగా వైవీ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్టారు. ఇటువంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకపోతే ఇవి నిబంధనలను అపహాస్యం చేస్తాయ‌ని మండిప‌డ్డారు.

• ఈ ఘటనలో అలసత్వం వహించిన అధికారులతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన సుబ్బారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలి.
• తగు చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.