Begin typing your search above and press return to search.

రాజ‌మండ్రిలో భారీ వ‌ర్షం.. మ‌హానాడుపై ఎఫెక్ట్‌.. అయినా కొన‌సాగుతున్న అన్న‌గారి శ‌త జ‌యంతి!

By:  Tupaki Desk   |   28 May 2023 6:17 PM GMT
రాజ‌మండ్రిలో భారీ వ‌ర్షం.. మ‌హానాడుపై ఎఫెక్ట్‌.. అయినా కొన‌సాగుతున్న అన్న‌గారి శ‌త జ‌యంతి!
X
తూర్పుగోదావ‌రి జిల్లా రాజమండ్రిలో ఆదివారం అనూహ్యంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద గాలి దుమారంతో టెంట్లు కూలిపోవడంతో పాటు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. నేతలు మాట్లాడుతుండగానే వర్షం కురుస్తుండటంతో ప్రాంగణంలో ఉన్న కార్య‌క‌ర్త‌లు ఇబ్బంది ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ.. కూర్చున్న చోట నుంచి లేవ‌కుండా.. కార్య‌క్ర‌మానికి ఇబ్బంది లేకుండా వ్య‌వ‌హ‌రించారు.

వాస్త‌వానికి ఆదివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు.. వ‌డ‌గాడ్పులు వీచాయి. ఉద‌యం నుంచి కూడా ఎండ భారీగా ఉంది. అయితే.. అనూహ్యంగా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల త‌ర్వాత వాతావ‌ర‌ణంలో ఒక్క‌సారిగా మార్పు చోటు చేసుకుంది.

భారీ ఎత్తున ఒక్క‌సారిగా ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. దీంతో టీడీపీ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్న మహానాడు సభా ప్రాంగణం వద్ద వర్షం బీభత్సానికి కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు. వర్షంలో తడుస్తూనే నేతల ప్రసంగాలు విన్నారు.

త‌ప్పిన పెను ప్ర‌మాదం

మ‌రోవైపు భారీ వర్షం, ఈదురు గాలులతో మహానాడు సభా ప్రాంగణం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. భారీ ఈదురు గాలులకు నేతల కటౌట్ విరిగిపోయి ఒక్కసారిగా వీఐపీ టెంట్‌పై పడ‌డంతో టెంట్‌ నేలకొరిగింది. అప్పటి వరకు అదే టెంట్‌లో నారా లోకేష్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, అశోక్‌ గజపతిరాజు, పంచుమర్తి అనురాధ, బాలవీరాంజనేయులు ఇతర ముఖ్యనేతలు ఉన్నారు. వీరందరూ బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఎన్టీఆర్‌ కటౌట్‌ పడి వీఐపీ టెంట్‌ నేలకొరిగింది.

వర్షంలోనూ నేతల ప్రసంగాలు కొనసాగించారు. తడవకుండా కార్యకర్తలు తలపై కుర్చీలు అడ్డుపెట్టుకొని సభను వీక్షించారు. వర్షం కారణంగా సభా ప్రాంగణం, మైదానంలో ఉన్న ఎల్‌ఈడీలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను ముందస్తు జాగ్రత్తగా సిబ్బంది నిలుపుద‌ల చేశారు.

చంద్రబాబు రాజమహేంద్రవరం నుంచి సభా ప్రాంగణానికి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కొంత ఆలస్యంగా సభా వేదిక వద్దకు ఆయన చేరుకున్నారు. వేమగిరి కూడలి వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేల సంఖ్యలో కార్యకర్తలు బహిరంగ సభకు తరలి వచ్చారు.