Begin typing your search above and press return to search.

మరోసారి టీఆర్‌ఎస్‌కు చంద్రబాబు వరం!?

By:  Tupaki Desk   |   28 Oct 2021 9:38 AM GMT
మరోసారి టీఆర్‌ఎస్‌కు చంద్రబాబు వరం!?
X
చంద్రబాబు రాజకీయ చాణక్యుడని ఆయన వ్యూహాలను పనిగట్టడం కష్టమని అంటుంటారు. బాబు ఎత్తుగడలను, తప్పిదాలను వరం మార్చుకున్న నేతను ఇంకేమనాలి. చంద్రబాబునే వరంగా భావించి గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గెలిచి.. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి టీఆర్‌ఎస్‌కు చంద్రబాబు వరం కాబోతున్నారు. అన్ని వ్యూహాలతో పాటు చంద్రబాబు అస్త్రాన్ని కూడా వాడుకుని హుజురాబాద్ బాద్‌షా కావాలని గులాబీ పార్టీ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. హుజురాబాద్‌లో చంద్రబాబు, టీఆర్‌ఎస్‌కు మరోసారి వరంగా మారబోతున్నారనే చర్చ ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి వేలుపెడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో చంద్రబాబు జోక్యాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను సద్వినియోగం చేసుకుని హుజురాబాద్‌లో విజయం సాధించాలని టీఆర్‌ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుని మహాకూటమిని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు అందరూ కలిసి కేసీఆర్‌ను ఓడించాలని సంకల్పించారు. అయితే ఆ ప్రయత్నం టీఆర్‌ఎస్‌కు వరంగా మారింది. చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇందులో ఆయన సక్సెస్ అయ్యారు. చంద్రబాబు లాంటి ఆంధ్ర నాయకుడు మరోసారి రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, మహాకూటమి గెలిస్తే.. తిరిగి తెలంగాణలో ఆంధ్ర పెత్తనం మొదలవుతుందని హెచ్చరిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ఆంధ్ర పాలకులపెత్తనాన్ని చెవిచూసిన తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. చంద్రబాబు చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు నష్టాన్ని, టీఆర్‌ఎస్ విజయాన్నికట్టబెట్టింది.

ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా ఆంధ్రా వ్యతిరేక సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు అన్ని రకాల పాచికలను అధికార పార్టీ వేస్తోంది. ఈటలను ఓడించడం అంత సులభం కాదని పనిగట్టిన టీఆర్‌ఎస్ చివరి అస్త్రంగా ఆంధ్ర సెంటిమెంట్ ప్రయోగించింది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ద్వారా ఈటల ప్రచారానికి చంద్రబాబు పరోక్షంగా నిధులు సమకూర్చుతున్నారని సోషల్ మీడియాలో కథనం ప్రచారంలోకి వచ్చింది. సెప్టెంబర్ 9న అర్ధరాత్రి అమరావతిలో ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారని, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ముగ్గురూ చర్చించుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలకు రేవంత్‌రెడ్డి అన్ని విధాల సహకరిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాను హుజురాబాద్‌లో గెలిస్తే 30 మంది ఎమ్మెల్యే తనతో వస్తారని చంద్రబాబుతో ఈటల అన్నారని ప్రచారం జరుగుతోంది.

ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 10న హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో రేవంత్‌తో ఈటల మరోసారి రహస్య మంతనాలు జరిపారని ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారికి ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణను తిరిగి తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఆంధ్రా నేతలు మరోసారి కుట్ర పన్నుతున్నారని, దానికి తెలంగాణ నేతలు సహకరిస్తున్నారని ఈ పరిణామాలను హుజురాబాద్ ఓటర్లకు చెప్పేందుకు టీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రచారం ద్వారా లబ్ది పొందాలని గులాబి పార్టీ భావిస్తోంది.