Begin typing your search above and press return to search.

అశోక్ ఢిల్లీకి... కుమార్తెకు టికెట్ ...?

By:  Tupaki Desk   |   22 March 2023 9:35 AM GMT
అశోక్ ఢిల్లీకి... కుమార్తెకు టికెట్ ...?
X
విజయనగరం రాజా వారు పూసపాటి సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని మరోసారి విజయనగరం ఎంపీ సీటు నుంచే పోటీ పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అశోక్ వంటి పెద్దాయన. చరిత్ర కల్గీన రాజవంశీకుడు ఎంపీగా బరిలో ఉంటే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఆ ప్రభావం పడి అన్ని సీట్లను నెగ్గుకుని రావచ్చు అన్నది చంద్రబాబు మార్క్ వ్యూహంగా ఉంది.

ఈ వ్యూహం 2014లో సూపర్ హిట్ అయింది. 2019లో జగన్ వేవ్ లో మాత్రం పనిచేయలేదు. ఇపుడు మళ్లీ టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్న వేళ తిరుగులేని ఎత్తుగడగా చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అశోక్ గజపతిరాజుకు ఢిల్లీ వెళ్ళడం ఇష్టమేనా అన్నదే చర్చగా ఉంది. ఆయన ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. ఒక వేళ తనకు కాకుంటే తన కుమార్తె రాజకీయ వారసురాలు అదితి గజపతిరాజుకు ఎమ్మెల్యేగా పోటీ చేసే చాన్స్ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం విజయనగరం అసెంబ్లీకి టీడీపీ ఇంచార్జిగా అదితి గజపతిరాజు ఉన్నారు. అయితే చంద్రబాబు మాత్రం పెద్దాయనను ఢిల్లీకి పంపించి విజయనగరం అసెంబ్లీ సీటుని బీసీలకు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న విజయనగరంలో ఈ సీటు నుంచి వారినే దింపాలని అలా జరిగితేనే విజయం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.

ఇక 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన మీసాల గీత సిద్ధంగా ఉన్నారు. ఆమె ఇప్పటికే ఒకటికి రెండుసార్లు చంద్రబాబుని కలసి తనకు సీటు కేటాయించనని కోరుకున్నారు. మరో వైపు గంటా శ్రీనివాసరావు టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఆయన వర్గీయులు కూడా స్పీడ్ అందుకున్నారు. ఆయన వర్గంలో ఉన్న మీసాల గీత విజయాంగరం సీటు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆమె వైసీపీ మీద ఘాటైన విమర్శలు చేయడం ద్వారా మళ్లీ మీడియాలో హడావుడి చేస్తున్నారు. అయితే అశోక్ గజపతిరాజుతో మీసాల గీత విభేదిస్తున్నారు. అందువల్ల ఆయన ఓటు ఎవరికి అన్నది చూడాలి. తాను ఎంపీగా పోటీ చేయలంటే తన కుమార్తెకు ఎమ్మెల్యే సీటు అని అశోక్ గజపతి రాజు అడగవచ్చు. ఒకవేళ కాదు అంటే తాను కోరుకున్న వారికే ఆ సీటు వచ్చేలా చూస్తారని అంటున్నారు.

మీసాల గీత రాజా వారిని ఎదిరించి విజయనగరంలో సొంతంగా వేరే పార్టీ ఆఫీస్ కూడా పెట్టి పోటీగా కార్యక్రమం నడిపారు. తన మీదకు అశోక్ కుమార్తెను పోటీగా తెస్తున్నారు అన్న ఆవేదన ఆగ్రహం ఆమెకు ఉంది. దాంతో అశోక్ కూడా ఆమె విషయంలో కఠినంగా ఉంటారని అంటున్నారు. ఇంకో విషయం కూడా ఉంది. ఏడున్నర పదుల వయసులో ఉన్న అశోక్ ఈసారి ఎన్నికలే చివరివిగా భావిస్తునారు. తాను క్రియశీలకంగా ఉండగానే తన కుమార్తెని ఎమ్మెల్యేగా చేయాలని బలమైన రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దాలని ఆయన అనుకుంటున్నారు.

ఈ చాన్స్ పోతే మళ్లీ రాదు అన్నదే ఆయన ఆలోచనగా ఉంది. అందుకే ఆయన విజయనగరం సీటుని తమ కుటుంబం చేతుల లో నుంచి పోనీయకుండా చూసుకుంటున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకు మంచి సన్నిహితుడు అయిన అశోక్ 2019లో మాదిరిగానే రెండు సీట్లు సాధిస్తారా లేక కుమార్తెను ఎంపీగా అయినా పంపిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా అశోక్ ని కాదని చంద్రబాబు విజయనగరంలో రాజకీయం చేయరనే అంటున్నారు ఆయన అనుచరులు. ఇపుడు గంటా బ్యాచ్ కూడా చురుకుగా ఉండడంతో టీడీపీలో సీట్ల కోసం పోరు సాగుతోంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.