Begin typing your search above and press return to search.

మోడీకి జ‌గ‌న్ బాకీ... 900 కోట్లు చెప్ప‌కుండానే లాగేసుకున్నారుగా!

By:  Tupaki Desk   |   7 Dec 2022 4:33 AM GMT
మోడీకి జ‌గ‌న్ బాకీ... 900 కోట్లు చెప్ప‌కుండానే లాగేసుకున్నారుగా!
X
ఏపీలో వైసీపీ ఏలుబ‌డిలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగా త‌యారైన విష‌యం తెలిసిందే. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఉద్యోగుల‌కు జీతాలు, రిటైరైన వారికి పింఛ‌న్లు ఇవ్వ‌లేక‌.. ప్ర‌భుత్వం స‌త‌మ‌త మ‌వుతోంది. ఏనెల‌కానెల ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నెల విష‌యాన్ని తీసుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు 7వ తారీకు వ‌చ్చినా రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మంది ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించ‌లేదు. ఇక‌, పింఛ‌న్ల‌ను అయితే 80 శాతం మందికి పెండింగ్ పెట్టారు.

ఇలాంటి తీవ్ర సంక‌ట స్థితిలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుకు భారీ షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక స్థితి నుంచి బ‌య‌ట ప‌డేందుకు.. కేంద్రం ఏమైనా సాయం చేస్తుంద‌ని ఎదురు చూసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి క‌నీసం మాట మాత్రం చెప్ప‌కుండానే పాత బ‌కాయిలు వ‌సూలు చేసుకుంది కేంద్ర ప్ర‌భుత్వం. దీంతో స‌ర్కారు ప‌రిస్థితి క‌క్క‌లేక‌.. మింగ‌లేక అంటారుక‌దా.. అలా మారిపోయింది.

ఏం జ‌రిగిందంటే.. కేంద్రానికి ఏపీ ప్ర‌భుత్వం నుంచి కొన్ని ప‌ద్దుల కింద నిధులు జ‌మ‌కావాల్సి ఉంది. గ‌త రెండేళ్లుగా వీటిని ఏపీ పాల‌కులు తొక్కి పెడుతున్నారు. వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు పంచాయ‌తీ జ‌రుగుతూనే ఉంది. అయితే.. గ‌త రెండు నెల‌లుగా అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రం కానీ, ఈ ఊసు ఎత్త‌లేదు. బ‌హుశ ఎన్నిక‌ల ఎఫెక్ట్ అయి ఉంటుంది. అయితే, హ‌ఠాత్తుగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అదేంటంటే.. ఏపీకి సాధార‌ణంగా అన్నిరాష్ట్రాల‌కు ఇచ్చిన‌ట్టుగానే జ‌నాభా ప్రాతిప‌దికన జీఎస్టీ వ‌సూళ్ల‌లో వాటా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ లెక్క‌న ఏపీ 682 కోట్ల రూపాయ‌లు జీఎస్టీ నిధులు రీయింబ‌ర్స్ చేస్తామ‌ని ఇటీవ‌ల కేంద్రం ప్ర‌క‌టించింది. వీటితో పాటు మ‌రికొన్ని ఖ‌ర్చుల‌కు 300 కోట్ల రూపాయ‌ల‌ను ఇస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్ర అధికారులు స‌మ‌గ్రంగా వివ‌రించారు. వీటిని చూసిన జ‌గ‌న్ స‌ర్కారు ఉబ్బిత‌బ్బిబ్బ‌యింది. అస‌లే చేతిలో రూపాయిలేక అల్లాడుతున్న స‌మ‌యంలో ఈ నిధుల‌ను ఉద్యోగుల జీతాలు, పింఛ‌న్ల‌కు స‌ర్దు బాటు 'హ‌మ్మ‌య్య‌' అని ఊప‌రి పీల్చుకుందామ‌ని భావించింది.

అయితే, రాష్ట్రం అనుకున్న‌ట్టుగా కేంద్రం ఆ నిధులు పంపించ‌లేదు. 'అరె ఇస్తామ‌న్నారు.. ఇంకా ఇవ్వ‌లేదేంటి?' అని అనుమానించిన రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి.. ఈ విష‌యాన్ని కేంద్రం ద‌గ్గ‌రే తేల్చుకుందామ‌ని నిర్ణ‌యించి.. కేంద్రఆర్థిక శాఖ‌కు ఫోన్ చేశారు. ఇంకే ముంది.. చావు క‌బురు చ‌ల్లాగా చెప్పారు అక్క‌డి అధికారులు.

"మీ ప్ర‌భుత్వం మాకు బాకీ ఉంది.. అందుకే మొత్తం గుండుగుత్త‌గా 982 కోట్ల‌ను జ‌మ చేసుకున్నాం. మీ దారి మీరు చూసుకోండి. ఈ నిధుల‌పై ఆశ‌లు పెట్టుకోకండి" అని తేల్చి చెప్పార‌ట‌. ఇంకే ముంది.. కేంద్రం నిర్ణయంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు తల పట్టుకున్నారు. ఈ నెల జీతాలు, పింఛన్ల గండం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇదీ.. సంగ‌తి!!

కొస‌మెరుపు! ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వ్య‌క్తులైనా, వ్య‌వ‌స్థ‌లైనా.. ఎవ‌రైనా బాకీ ఉన్న సొమ్మును చెప్పి తీసుకుంటారు. కానీ, అదేంటో చెబితే ఇవ్వ‌ర‌ని అనుకుందో.. లేక ఏపీ ప‌రిస్థితి దిగ‌జారిపోయింది.. చెప్ప‌డం ఎందుకులే అనుకుందో కేంద్రంలోని మోడీ స‌ర్కారు చెప్పకుండానే నిధుల‌కు చెల్లుకొట్టారు!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.