Begin typing your search above and press return to search.

కుమార్తె పెళ్లి చేసి వస్తూ ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

By:  Tupaki Desk   |   7 Feb 2022 5:37 AM GMT
కుమార్తె పెళ్లి చేసి వస్తూ ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది  దుర్మరణం
X
అనంతపురం జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుమార్తె పెళ్లి చేసి తిరిగి వస్తున్న తండ్రితో పాటు.. వారి కుటుంబానికి చెందిన వారంతా ఆ ఘోర ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. తొమ్మిది ప్రాణాల్ని బలి తీసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. ఇన్నోవాను కంటైనర్ ఢీ కొట్టటం.. వాహనం నుజ్జునుజ్జు కావటం.. అందులో ప్రయాణిస్తున్న వారంతా దుర్మరణం పాలయ్యారు. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఘోర ప్రమాదం వివరాల్లోకి వెళితే..

ఏపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప కుమార్తె వివాహం శనివారం కర్ణాటకలోని బళ్లారిలో ఘనంగా జరిగింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత వెంకటప్ప తన బంధువులతో కలిసి ఇన్నోవా వాహనంలో స్వగ్రామానికి (అనంతపురం జిల్లా నిబంగల్లు) బయలుదేరారు. ఇక్కడి వరకు అంతా ఆనందంగా సాగిన వారి ప్రయాణంపై మృత్యుదేవత ఒక్కసారిగా పంజా విసిరింది. అప్పటివరకు ఆనందోత్సాహాలు.. పెళ్లి వేడుక అలసటతో ఉన్నారు. వీరి వాహనం ఉరవకొండ మండలం బూదగవి వద్దకు వచ్చినంతనే వారి వాహనాన్ని కంటైనర్ లారీ ఢీ కొట్టింది.

అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. వాహనంలో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడిక్కడే మరణించారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు.. ఇద్దరు పురుషులు.. ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం గురించి విన్నంతనే ఉరవకొండ ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్.. ఎంపీ తలారి రంగయ్య.. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తీవ్ర షాక్ కు గురయ్యారు. ఘటనా స్థలం వద్దకు చేరుకొని తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్నంతనే జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లి.. ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు.. వెంకటప్పకు చెందిన నింబగల్లు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణం అతి వేగమే కారణంగా భావిస్తున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

ఘోర ప్రమాదంలో మరణించిన వారు వీరే

నింబగల్లుకు చెందిన

- కోకా వెంకటప్ప
- బొమ్మనహాళ్‌కు చెందిన
- అశోక్
- రాధమ్మ
- సరస్వతి
పిల్లల పల్లికి చెందిన
- శివమ్మ
రాయలదొడ్డికి చెందిన
- శుభద్రమ్మ
లత్తవరానికి చెందిన
- స్వాతి
- జాహ్నవి
- జశ్వంత్