Begin typing your search above and press return to search.

8.46.. అమెరికా సరికొత్త ఉద్యమ నినాదం

By:  Tupaki Desk   |   5 Jun 2020 4:00 PM GMT
8.46.. అమెరికా సరికొత్త ఉద్యమ నినాదం
X
పోలీసుల దౌర్జన్యం ప్రపంచానికి కొత్తేం కాదు. అయితే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికానే కాదు.. ప్రపంచాన్ని కదిలించివేస్తోంది. 20 డాలర్ల దొంగనోటును మార్చారన్న అభియోగం నిజమో కాదో అన్నది తేల్చకుండా అత్యంత అనాగరికంగా వ్యవహరించి.. ప్రాణాలు పోవటానికి కారణమైన మినియాపోలీస్ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ను మే ఇరవైఐదున మినియాపోలీస్ పోలీస్ అధికారి కమ్ శ్వేతజాతీయుడు డెరెక్ చెవెన్ అనాగరిక చర్యతో అగ్రరాజ్యం అట్టుడికిపోతోంది. ఫ్లాయిడ్ మెడ మీదన తన కాలితో బలంగా నొక్కుతూ 8.46 నిమిషాల పాటు చేసిన అనాగరిక చర్య ఇప్పుడు అమెరికాలో సరికొత్త ఉద్యమంగా మారింది. పోలీసుల విచారణలో ప్లాయిడ్ మెడ మీద శ్వేతపోలీస్ జరిపిన దుశ్చర్య 8.46 నిమిషాల పాటు అన్న విషయంపై కాస్తంత స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఉద్యమ రూపం మారింది.

అయితే.. ఈ సమయాన్ని ఎలా నిర్దారించారన్న దానిపై అవగాహన లేకున్నా..ఈ సమయం మాత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో.. ఆందోళనకారులు కొత్త పంథాలో తమ నిరసనల్ని తెలియజేస్తున్నారు. చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే వారు.. చేతుల్లో కొవ్వొత్తుల్ని పెట్టుకొని 8.46 నిమిషాల పాటు ఉంటున్నారు. ఈ సమయాన్ని ప్రాతిపదికగా చేసుకొని మోకాళ్లపై పాకుతూ నిరసన వ్యక్తం చేయటంతో పాటు.. సంతాపాలు కూడా ఇంతే సమయాన్ని పాటిస్తున్నాయి. అంతదాకా ఎందుకు.. వయాకామ్ సీబీఎస్ గత వారం ఫ్లాయిడ్ కు నివాళులు అర్పిస్తూ.. 8.46 నిమిషాల పాటు తమ ప్రసారాల్ని నిలిపివేయటం గమనార్హం.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు రాసిన లేఖలో.. ఫ్లాయిడ్ కు నివాళులు అర్పించేందుకు 8.46నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరారు. అంతేకాదు.. జాతివివక్షపై పోరాడేందుకు గూగుల్ రూ.210 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో జాతివివక్షపై వ్యక్తమవుతున్న నిరసనలకు 8.46 నిమిషాల వ్యవధి ఇప్పుడో కొత్త సంకేతంగా మారింది.