Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకుతో సహా 7గురు మెడికోలు దుర్మరణం

By:  Tupaki Desk   |   25 Jan 2022 10:30 AM GMT
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకుతో సహా 7గురు మెడికోలు దుర్మరణం
X
దారుణ రోడ్డు ప్రమాదం తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు పరీక్షలు ముగియటంతో బయలుదేరిన వారు.. ఇంటికి చేరకుండానే చోటు చేసుకున్న దారుణ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా మొత్తం ఏడుగురు మెడికోలు ఉన్నారు. ఇంత దారుణ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే..

మహారాష్ట్రలోని డియోలీ నుంచి వార్దాకు వెళుతున్నారు ఏడుగురు వైద్య విద్యార్థులు. వారు ప్రయాణిస్తున్న ఎస్ యూవీ వాహనం సెల్సురా సమీపంలోకి వచ్చిన తర్వాత అదుపు తప్పింది. అదే సమయంలో వారి వాహనం బ్రిడ్జి మీద ఉండటం.. దాని మీద నుంచి 40 అడుగుల కిందకు పడిపోవటంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మెడికోలు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.

ఏడుగురు మెడికోల్లో భండారు జిల్లాకు చెందిన తిరోడు ఎమ్మెల్యే విజయ్ రహంగేడేల్ కొడుకు అవిష్కార్ రహంగ్ డేల్ ఉన్నట్లుగా గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారిలో నితీశ్ సింగ్ హౌస్ సర్జన్ అని.. మిగిలిన ఆరుగురు శవాంగి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

పరీక్షలు రాసిన వారు.. సెలవుల్లో భాగంగా ఇళ్లకు బయలు దేరారు. ఇందుకోసం వాహనంలో అందరూ బయలుదేరారు. అనుకోని రీతిలో ప్రమాదం చోటు చేసుకోవటం.. అందరూ మరణించటం.. చనిపోయిన వారంతా కాబోయే వైద్యులు కావటం గమనార్హం. పిల్లలు పెద్దవాళ్లై.. ప్రయోజకులుగా మారుతున్నారన్న వేళ.. అనూహ్య రీతిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.