Begin typing your search above and press return to search.

63 ఎన్‌ కౌంటర్లు.. లెక్కలేనన్ని దందాలు.. క్రిమినల్ పోలీస్!

By:  Tupaki Desk   |   24 March 2021 4:30 PM GMT
63 ఎన్‌ కౌంటర్లు.. లెక్కలేనన్ని దందాలు.. క్రిమినల్ పోలీస్!
X
పోలీస్ అనేవాడు .. ప్రజా రక్షకుడు. కానీ , కొందరు చేసే తప్పుడు పనుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వస్తుంది. సాధరణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి, లేదా పోలీసు అధికారి సస్పెండయి, రాజీనామా చేశాక మళ్లీ పోస్టింగ్‌ దక్కుతుందా, అదీ 16 సంవత్సరాల తరువాత , కానీ విచిత్రం ఏమిటంటే సచిన్‌ వాజేకు దక్కింది. 2004లో సస్పెండయితే 2020లో కీలక విభాగంలో పోస్టింగ్‌. ఇదెలా సాధ్యం అనేది ఇప్పుడు చిక్కు వీడని ప్రశ్న.. అయితే ఈయన ప్రస్తుతం అంబానీ బెదిరింపుల కేసులో అరెస్ట్ అయ్యి ఎన్ ఐ ఏ అదుపులో ఉన్నాడు.

కొల్హాపూర్‌కు చెందిన సచిన్‌ వాజే 1990లో ఎస్సైగా పోలీసు శాఖలో చేరాడు. మొదటి పోస్టింగ్‌ గడ్చిరోలిలో. ఆ తర్వాత తరువాత థానేకు బదిలీ అయి అక్కడి నుంచి ముంబైకి ట్రాన్స్ ‌ఫర్‌ అయ్యాడు. ప్రదీప్ ‌శర్మ, దయా నాయక్‌ లతో పాటు ఈయన కూడా ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్ట్. కెరీర్‌ లో 63 మంది కరడుగట్టిన నేరగాళ్లను ఎన్‌ కౌంటర్ చేశాడు. దందాలు, కిడ్నాపులు, దోపిడీ రాకెట్ల సరేసరి. మాఫియాతో చేతులు కలిపిన నేర చరిత్ర వాజేదని ముంబై పోలీస్‌ వర్గాలు అంటున్నాయి. 2003లో ఘట్ ‌కోపర్‌ బాంబు పేలుడు కేసులో నిందితుడైన ఖ్వాజా యూనిస్‌ కస్టడీలో చనిపోయిన కేసులో సస్పెండై , ఆ తర్వాత శివసేనలో చేరిపోయాడు. వాజే సాంకేతికత వాడకంలో సిద్ధహస్తుడు. సెల్‌ఫోన్‌ ఇంటర్‌సెప్షన్‌, ఈమెయిల్‌ ట్రాకింగ్‌ విభాగాలను ముంబై కమిషనరేట్‌లో ఏర్పాటు చేశారు. 1997లో అంతర్జాతీయ క్రెడిట్‌ కార్డ్‌ రాకెట్‌ను బట్టబయలు చేసి ఆసియాలోనే అలాంటి క్రిమినల్స్‌ను అరెస్ట్‌ చేసిన వ్యక్తిగా పేరుగడించాడు. ఫేస్‌ బుక్‌ తరహాలో మరాఠీలో ‘లాయ్ ‌భారీ’ని సృష్టించాడు.

శివసేన ప్రభుత్వం వచ్చాక వాజే మళ్లీ రంగప్రవేశం చేశాడు. కొవిడ్‌ వల్ల ఆఫీసర్లు తక్కువయ్యారంటూ సంకీర్ణ సర్కార్‌ అతడిని విధుల్లోకి తీసుకుంది. కీలకమైన క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(సీఐయూ)కి హెడ్‌గా ఉంటూ.. అర్ణబ్‌ గోస్వామి కేసు, టీఆర్పీ స్కాం, హృతిక్‌ రోషన్‌ ఫేక్‌ ఈమెయిల్‌ కేసు, దిలీప్‌ చాబ్రియా కేసులాంటి హైప్రొఫైల్‌ కేసులెన్నింటినో ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు. అయితే వాజే కథకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పడినది మాత్రం అంబానీ నివాసం వద్ద జిలెటిన్‌ స్టిక్స్ ‌తో నిండిన ఓ స్కార్పియో వాహనం ఫిబ్రవరి 25న లభ్యం కావడం, ఈ వాహనాన్ని అక్కడ పెట్టింది సచిన్‌ వాజేయేనని ఎన్ ‌ఐఏ అంటోంది. మరో విశేషం ఏమిటంటే అంబానీ కేసును విచారించేది కూడా ఈయనే. ఆకస్మికంగా మార్చి 13న ఆయనను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. ఆ తరువాత సీఐయూలోని ఆయన కేబిన్‌ నుంచీ, ఇంటి నుంచీ అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఇంకా కొన్ని వస్తువులు, ఐదు లక్షల నగదు స్వాధీనపర్చుకుంది.

ఈ వాహనాన్ని మన్‌ సుఖ్‌ హిరేన్‌ అనే వ్యాపారవేత్త నుంచి నాలుగు నెలల కిందట వాజే తీసుకున్నారని, కొద్దిరోజుల కిందటే వాపస్‌ ఇచ్చారని కుటుంబసభ్యులు చెప్పారు. ఆ తర్వాత వర్లీ సమీపంలో వాజే, హిరేన్‌ కలిసి కార్లోనే మాట్లాడుకున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఇది జరిగిన రెండ్రోజులకు హిరేన్‌ మృతదేహం సముద్రపు కయ్య వద్ద బయటపడింది. ఈ మృతికి కారకుడు వాజేయేనని ఏటీఎస్‌ ప్రకటించింది. ఎన్‌ఐఏ ఇంటరాగేషన్‌లో వాజే ఓ పోలీస్‌ ఉన్నతాధికారి పేరు, కొందరు శివసేన నేతల పేర్లు బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాజే తన ఇంటరాగేషన్‌లో పరమ్‌బీర్‌ పేరును బయటపెట్టడంతో ఎన్‌ఐఏ ఆయనను వ్యూహాత్మకంగా ముందుకు తోసినట్లు తెలుస్తోంది. పరమ్‌బీర్‌కు వాజే అంటే పడదు. వాజే నేరుగా హోంమంత్రి దేశ్‌ముఖ్‌కు, ఇతర ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ చేయడం, వారు అతనిని చేరదీసి పనులు చేయించుకోవడం ఆయనకు అసంతృప్తి కలిగించింది. చివరకు కేసు ముదిరి, వాజే అరెస్టయి, తనను బదిలీ చేయడంతో పరమ్‌బీర్‌ ఎదురుతిరిగారు.