Begin typing your search above and press return to search.

పంజాబ్‌ లో ప్ర‌మాదం..50 మంది దుర్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   19 Oct 2018 10:03 PM IST
పంజాబ్‌ లో ప్ర‌మాదం..50 మంది దుర్మ‌ర‌ణం
X
ద‌స‌రా పండుగ రోజు ఘోర విషాదం చోటుచేసుకుంది. సంతోషంగా సాగుతున్న వేడుక‌ల స‌మ‌యంలో క‌ల‌క‌లం జ‌రిగింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌ సర్ వద్ద ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వే ట్రాక్‌ పై ఉన్న వారిని హౌరా ఎక్స్‌ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 50 మంది దాకా మృతి చెందినట్లు సమాచారం. రైల్వే ట్రాక్‌ కు సమీపంలో రావణ దహనం జరుగుతుండగా జనాలు రైల్వే ట్రాక్‌ పై నిలబడి దహనాన్ని వీక్షిస్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. అమృత్‌ సర్‌ కు సమీపంలోని చౌరా బజార్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో సంతోషంగా దసరా వేడుకలు చేసుకుంటున్న వారు మృత్యు ఒడిలోకి జారుకోవడంతో ఆ ప్రాంతామంతా ఆర్తనాదాలతో దద్ధరిల్లింది.

జోధా పాటక్ ప్రాంతంలో దసరా ఉత్సవాల్లో భాగంగా రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మం కోలాహ‌లంగా సాగుతోంది. ఇదే స‌మ‌యంలో ఒక్కసారిగా రైల్వే ట్రాక్‌ పైకి హౌరా ఎక్స్‌ ప్రెస్ దూసుకువచ్చింది. దీంతో ట్రాక్‌పై నిలబడ్డ జనాలను ఢీకొడుతూ వెళ్లిపోయింది. రావణ దహనం జరుగుతుండటం - క్రాకర్స్ పేలుస్తుండటంతో వాటి సౌండ్‌ కు రైలు సౌండ్ జనాలకు వినిపించలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ 500 నుంచి 700 దాకా ప్ర‌జ‌లు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్నవెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఉన్నవారందరినీ ఖాళీ చేయించామని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.