Begin typing your search above and press return to search.

ఆ 39 ఇండియ‌న్స్ ఇక లేరు!

By:  Tupaki Desk   |   20 March 2018 9:09 AM GMT
ఆ 39 ఇండియ‌న్స్ ఇక లేరు!
X
పొట్ట‌కూటి కోసం దేశం కాని దేశాల‌కు త‌రలివెళ్లి తీవ్రవాదుల చెర‌కు చిక్కిన 39 మంది భార‌తీయులు ప్రాణాల‌తో లేరు. ఇరాక్‌ లో ఐసిస్ తీవ్ర‌వాదుల‌తో ఆ దేశ సైన్యం కొన‌సాగించిన సుదీర్ఘ పోరులో తీవ్ర‌వాదుల చెర‌కు చిక్కిన భార‌తీయులు చివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విష‌యం తెలియ‌క స‌ద‌రు భార‌తీయుల కుటుంబాలు నాలుగేళ్లుగా క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నాయి. తీవ్ర‌వాదుల చెర‌కు చిక్క‌డం, ఆ త‌ర్వాత ఏమైపోయారో కూడా తెలియ‌ని స‌ద‌రు వ్య‌క్తుల కోసం భార‌త ప్ర‌భుత్వం - ప్ర‌త్యేకించి కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి హోదాలో బీజేపీ సీనియ‌ర్ నేత సుష్మా స్వ‌రాజ్ చేయ‌ని య‌త్నమంటూ లేద‌నే చెప్పాలి. సుష్మా చేస్తున్న ముమ్మ‌ర గాలింపు చ‌ర్య‌ల‌తో త‌మ వారిని ఎలాగైనా తిరిగి చూస్తామ‌న్న ధీమా బాధితుల కుటుంబాల‌తో పాటు యావ‌త్ భార‌తావ‌ని కూడా ఆశ‌గా ఎదురు చూసింది. అయితే చివ‌రకు సుష్మా నోట నేటి పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా వినిపించిన విషాద ప్ర‌క‌ట‌న మొత్తం దేశాన్నే తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

ఇరాక్‌ లో నాలుగేళ్ల క్రితం బందీలుగా చిక్కిన 39 మంది భార‌తీయులు స‌జీవంగా లేర‌ని - వారిని ఉగ్ర‌వాదులు చంపేశార‌ని నేటి ఉద‌యం పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో సుష్మా స్వ‌రాజ్ గ‌ద్గ‌ద స్వ‌రంతో ప్ర‌క‌టించేశారు. 2014లో ఇరాక్‌ లో కిడ్నాపైన 39 మంది భారతీయల ఆచూకీ కోసం భారత్ అనేక ప్రయత్నాలను చేసిన విషయాన్ని సుష్మాస్వరాజ్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కిడ్నాప్ చేసిన భారతీయులను ఉగ్ర‌వాదులు చంపేశారని ఆమె ప్రకటించారు. ఐసిస్ తీవ్రవాదులు భారతీయులను చంపేసి మోసుల్‌ లోనే సామూహికంగా పూడ్చిపెట్టారని సుష్మా చెప్పారు. భారతీయులను పూడ్చి పెట్టిన స్థలాన్ని రాడార్లు కనిపెట్టాయని ఆమె సభలో చెప్పారు. అయితే మృతదేహలను భారత్‌ కు రప్పించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నామని ఆమె చెప్పారు. మృతదేహాలను పరీక్షల కోసం బాగ్దాద్ పంపగా డీఎన్ ఏ శాంపుల్స్ 70 శాతం వరకూ మ్యాచ్ అయ్యాయని ఆమె సభకు తెలిపారు.

ఆ అవశేషాలను తీసుకువచ్చేందుకు జనరల్ వీకే సింగ్ బాగ్దాద్ వెళ్తున్నారని సుష్మా చెప్పారు. ప్రత్యేక విమానంలో ఆ మృత‌దేహాల‌ను భార‌త్‌ కు తీసుకువస్తారని తెలిపారు. ఆ అవశేషాలను తొలుత అమృత్ సర్ - తర్వాత పాట్నా - కోల్‌ కతాలకు తరిలిస్తామని చెప్పారు. ఇరాక్‌లో చనిపోయిన వారికి సంతాపంగా రాజ్యసభ ఒక్క నిమిషం పాటు మౌనం పాటించింది. ఈ ప్ర‌కట‌న చేస్తున్న స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌లో కొంత‌వ‌ర‌కు స‌భ స‌జావుగా సాగినా... లోక్‌ సభలో కేంద్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. విపక్ష ఎంపీలు వెల్‌ లోనే ఉండి గొడవ చేశారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స్పీకర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ మానవత్వం లేదా స‌భ్యుల‌ను మంద‌లించారు. అయినా విప‌క్ష స‌భ్యులు విన‌క‌పోవ‌డంతో గంద‌రగోళ వాతావ‌ర‌ణంలోనే లోక్ స‌భ‌లో సుష్మా ప్ర‌క‌ట‌న చేశారు.