Begin typing your search above and press return to search.

పాము పగబట్టిందని దోషం పేరుతో రూ.37 లక్షలు లూటీ

By:  Tupaki Desk   |   6 July 2022 5:59 AM GMT
పాము పగబట్టిందని దోషం పేరుతో రూ.37 లక్షలు లూటీ
X
నమ్మకాలు ఉండాలి.. కానీ మరీ మూఢ నమ్మకాలు పనికిరాదు. ఆ మూఢనమ్మకాలతోనే స్వామీజీలు.. గురూజీలు పుట్టుకొచ్చి మన దగ్గర సర్వం దోపిడీ చేస్తున్నారు. తాజాగా పాము అడ్డువచ్చిందని భయపడ్డ ఓ వ్యక్తి ఓ స్వామిని ఆశ్రయించగా.. మొత్తం గుండు చేయించి పంపించాడు.

బైక్ మీద వెళుతుండగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన పామును తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు ఓ వ్యక్తి. ఆ విషయం చెప్పగానే ఓ నకిలీ బాబా 'సర్పదోషం' పేరుతో బాధితుడిని దోపిడీ చేయడానికి స్కెచ్ గీశాడు. పాముగండం ఉందని.. పూజలు చేయకపోతే కుటుంబం మొత్తం మృత్యువాతపడుతారని మాయమాటలు చెప్పి ఈ ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ నకిలీ బాబాల గుట్టు రట్టు చేశారు పోలీసులు.

ఘట్ కేసర్ కు చెందిన కొండాల్ రెడ్డి అనే వ్యక్తి ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. వ్యాపారం నిమిత్తం ఒకరోజు బైక్ పై వెళుతుండగా రోడ్డుపై అకస్మాత్తుగా పాము రావడంతో దాన్ని తప్పించబోయి బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో కొండల్ రెడ్డికి గాయాలయ్యాయి. రాజస్థాన్ లోని సిరోహి ప్రాంతం నుంచి వచ్చిన నకిలీ బాబాలు.. కొండల్ రెడ్డికి జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. మీకు సర్పదోషం ఉందని.. మేం చెప్పిన పూజలు చేయకపోతే మీ కుటుంబం మొత్తం దోషాలతో మృత్యువాతపడుతుందని కొండల్ రెడ్డిని దొంగ బాబా బెదిరించాడు. దోష నివారణ పూజలు చేస్తామంటూ కొండల్ రెడ్డిని నమ్మించాడు. అఘెర, సాధు వేషాలతో వచ్చి పూజల పేరుతో మభ్యపెట్టాడు.

అది నిజమని నమ్మిన కొండల్ రెడ్డి వారు చెప్పిన విధంగా పూజలు చేశారు. పూజల పేరుతో కొండల్ రెడ్డి వద్ద నుంచి ఆ ముఠా రూ.37 లక్షలు స్వాహా చేసింది. పదే పదే డబ్బులు అడుగుతుండడంతో అనుమానం వచ్చిన కొండల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.

భువనగిరి పోలీసులు 'బాబాల' అవతారం ఎత్తిన రామ్ నాథ్ , గోవింద్ నాథ్ తోపాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు.

అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి రూ.8 లక్షల నగదు, కౌంటింగ్ మిషన్, రుద్రాక్ష మాలలు, పూజా సామన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మనిషి రాకెట్ తో అంతరిక్షానికి వెళుతున్న ఈరోజుల్లోనూ మేఢనమ్మకాలతో విచక్షణ మరిచి లక్షలు కోల్పోతున్న అజ్ఞానులు ఇంకా మన సమాజంలోనే ఉండడం గమనార్హం.