Begin typing your search above and press return to search.

ఆ ఆర్థిక మోసగాడికి 300 ఏళ్ల జైలు శిక్ష !

By:  Tupaki Desk   |   30 Aug 2021 9:30 AM GMT
ఆ ఆర్థిక మోసగాడికి 300 ఏళ్ల జైలు శిక్ష !
X
అరిఫ్‌ నక్వీ .. గత కొద్ది రోజుల ముందు వరకు పాకిస్థాన్‌ కు చెందిన ఓ వ్యాపారవేత్త. ప్రపంచంలోని అపరకుబేరులతో మీటింగ్స్ , ఎన్నో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు. కానీ, ఇప్పుడు ప్రపంచ మోసగాడిగా గుర్తింపుపొందాడు. వాపార దిగ్గజాల్ని ఆయన ఎంత సునాయాసంగా మోసం చేయగలిగాడు. 1960లో పాకిస్తాన్‌ కరాచీలో పుట్టిన నక్వీ.. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఆర్థిక మేధావిగా ఎన్నో సదస్సుల్లో ప్రసగించడమే కాకుండా, ప్రముఖ యూనివర్సిటీల విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఆపై అమన్‌ పేరుతో ఓ ఫౌండేషన్‌ నెలకొల్పి.. చందాలు వసూలు చేయడం మొదలుపెట్టాడు. నఖ్వీ, 118 మిలియన్‌ డాలర్లతో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అబ్రాజ్‌ గ్రూప్‌ ను స్థాపించాడు. ఈ క్రమంలోనే పేదరిక నిర్మూలన ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమవుతున్నట్టు నఖ్వీ ప్రకటించాడు.

ఈ క్రమంలోనే 2010 ఏప్రిల్‌ లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిర్వహించిన వ్యాపారవేత్తల సమావేశానికి ఆహ్వానం అందిన 250 మంది ముస్లిం వ్యాపారవేత్తల్లో ఈయన కూడా ఉన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే పెట్టుబడులు, శిక్షణ, ఉపాధి కల్పన లాంటి అంశాలపై నఖ్వీ ప్రసంగించి ఆకట్టుకున్నాడు. ఇది జరిగిన రెండు నెలల తర్వాత అమెరికా ప్రభుత్వం నఖ్వీకి చెందిన అబ్రాజ్‌ సంస్థలో 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. పలు యూనివర్సిటీలకు నఖ్వీ కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. గేట్స్‌ ఫౌండేషన్‌ మాదిరిగానే సేవా కార్యక్రమాల కోసం అమన్‌ ఫౌండేషన్‌ ను స్థాపించాడు.

ఈ సంస్థ కోసం నిధుల సేకరణకు 2017 సెప్టెంబర్‌ లో న్యూయార్క్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలపై పోరాడేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చాడు. ఈ సమయంలో ప్రపంచ కుబేరులు, బలమైన నేతలను కలుసుకున్నారు. వారిలో బిల్‌ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ క్రమంలోనే నఖ్వీ చురుకుదనం, దాతృత్వ గుణం బిల్‌ గేట్స్‌ ను ఆకట్టుకున్నాయి.

అతడి వాక్చాతుర్యానికి బుట్టలో పడిపోయిన గేట్స్, పాక్‌ లో జనాభా నియంత్రణకు తన ఫౌండేషన్‌ నుంచి 100 మిలియన్‌ డాలర్లను అందజేశారు. ఆ తర్వాత న్యూ అబ్రాజ్‌ గ్రోత్‌ మార్కెట్స్‌ హెల్త్‌ ఫండ్‌ కు ఇతర మార్గాల ద్వారా 900 మిలియన్‌ డాలర్లు అందాయి. అయితే ఈ నిధులను దుర్వినియోగం చేయడం అప్పటికే ప్రారంభించిన నఖ్వీ ఆడిట్ సమయంలో బ్యాంకుల్లో డబ్బులు చూపించి ఆ తర్వాత విత్‌ డ్రా చేసేవారు. కొన్నాళ్ల తర్వాత ఓ ఉద్యోగి అబ్రాజ్ సంస్థలో జరుగుతున్న మోసంపై రహస్య ఈ-మెయిల్‌ పంపడంతో నఖ్వీ గుట్టురట్టయ్యింది.

అబ్రాజ్‌ లెడ్జర్ ఖాతాలపై గేట్స్‌ ఫౌండేషన్‌ దర్యాప్తు చేయడంతో 660 మిలియన్‌ డాలర్లు పెట్టుబడిదారులకు తెలియకుండా రహస్య ఖాతాలకు మళ్లినట్టు గుర్తించారు. మరో 385 మిలియన్‌ డాలర్లకు ఇప్పటికీ లెక్కలు లేవు. 2019 ఏప్రిల్‌ 10న లండన్‌ లోని హీత్రో ఎయిర్‌ పోర్ట్‌ లో నఖ్వీని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అయితే బెయిల్‌ దొరికినప్పటికీ, వ్యక్తిగత పూచీ కత్తులపై హౌజ్‌ అరెస్ట్‌ ను కొనసాగిస్తున్నారు. మరోవైపు దుబాయ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అథారిటీ కూడా నక్వీ నేరాలపై విచారణ కొనసాగిస్తోంది. నక్వీ ఆర్థిక నేరాలు గనుక రుజువైతే 300 ఏళ్లు జైలు శిక్ష పడనుంది.