Begin typing your search above and press return to search.

ఈసారికి 2934 మద్యం షాపులే.. మాట.. మడమ తిప్పినట్లేగా జగన్?

By:  Tupaki Desk   |   2 Oct 2021 11:30 AM GMT
ఈసారికి 2934 మద్యం షాపులే.. మాట.. మడమ తిప్పినట్లేగా జగన్?
X
‘మాట తప్పను.. మడమ తిప్పను’ అన్న మాట విన్నంతనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారు. విపక్ష నేతగా ఉన్న వేళలోనూ.. భారీ పాదయాత్ర చేపట్టినప్పుడు.. ఏపీలో సంపూర్ణమద్యనిషేధం దిశగా అడుగులు వేసేందుకు వీలుగా.. తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యం పాలసీకి సంబంధించి కీలక మార్పులు ఉంటాయని పేర్కొనటం తెలిసిందే. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వచ్చినంతనే.. మద్యం అమ్మే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవటమే కాదు.. రూ.100 విలువ చేసే లిక్కర్ బాటిల్ ను దగ్గర దగ్గర రూ.400లకు పెంచేసింది.

ఏపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. ఏడాదికేడాదికి మద్యం దుకాణాల్ని తగ్గించటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించాలి. కానీ.. తాజాగా జారీ చేసిన మద్యం షాపుల పర్మిషన్ జాబితాను చూసినప్పుడు ప్రస్తుతం ఉన్న 2934 మద్యం దుకాణాల్ని యధాతధంగా మరో ఏడాది పాటు కొనసాగించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది. మద్యం తాగే అలవాటును తగ్గించటం కోసం.. తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని.. దీనికోసమే.. మద్యం ధరల్ని భారీగా పెంచినట్లు చెబుతున్నారు.

అదే నిజమైనప్పుడు.. మద్యం తాగే అలవాటును తగ్గించాలని భావించినప్పుడు మద్యం షాపుల్ని తగ్గించటం.. మద్యం అమ్మకాలను తగ్గేలాప్రయత్నాలు చేయాలి. కానీ.. అందుకు భిన్నంగా ఏడాదిలో రూ.20వేల కోట్ల ఆదాయం ఒక్క మద్యం అమ్మకాల ద్వారానే రావాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది. గత పాలసీలోనూ మద్యం దుకాణాల్ని తగ్గించని ప్రభుత్వం.. తాజాగా విడుదల చేసిన కొత్త పాలసీలోనూ పాత తీరునే ప్రదర్శించిందే తప్పించి.. కొత్తగా చేసిందేమీ లేదు.

ఏపీలో జగన్ సర్కారు పవర్లోకి రావటానికి ముందు ఏపీలో 4380 మద్యం దుకాణాలు ఉండేవి. అవన్నీ ప్రైవేటు వ్యక్తులు నిర్వహించేవారు. మద్య నిషేధంలో భాగమంటూ మద్యం అమ్మే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవటం షాపుల్ని 3500లకు కుదించింది. ఆ తర్వాత షాపుల్ని 2934కు తగ్గించింది. సాంకేతికంగా చూస్తే.. రెండు దశల్లో షాపుల సంఖ్య తగ్గించి.. మూడో దశలో మరింత తగ్గిస్తారన్న మాట వినిపించింది. అందుకు భిన్నంగా షాపుల్ని తగ్గించలేదు. మద్యం తాగించటం తగ్గించామని ప్రభుత్వం చెబుతున్నా.. ధరల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి దొంగచాటుగా మద్యం స్మగ్లింగ్ మరింత పెరిగిందని.. ప్రభుత్వం చెబుతున్న దానికి.. వాస్తవంగా జరిగే దానికి ఎలాంటి పోలికా లేదన్న మాట వినిపిస్తోంది.

మద్యం అమ్మకాల మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్పే ప్రభుత్వం మాటలకు.. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి ఏడాదికి పెరుగుతున్న ఆదాయాన్ని చూస్తేనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. 2015-16లో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి పన్ను రూపంలో రూ.12,746 కోట్లు లభిస్తే.. 2016-17లో రూ.13,480 కోట్లు వచ్చింది. 2017-18లో రూ.15,379కోట్లు రాగా.. 2018-19లో 17,340 కోట్లు వచ్చింది. 2019-20లో రూ.17,707 కోట్లు రాగా.. 2020-21లో రూ.18,005 కోట్ల ఆదాయం వచ్చింది. సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు పడటమంటే..ఆదాయం పెంచుకుంటూ పోవటమా? అన్నది అసలు ప్రశ్న. మరి.. దీనికి ఏపీ ముఖ్యమంత్రి ఏమని సమాధానం ఇస్తారు?