Begin typing your search above and press return to search.

జర భద్రం; సోమవారం ‘పిడుగుల’ వర్షం

By:  Tupaki Desk   |   7 Sept 2015 9:29 AM IST
జర భద్రం; సోమవారం ‘పిడుగుల’ వర్షం
X
వానజల్లు కోసం అత్రంగా చూస్తున్న తెలుగురాష్ట్రాల వారికి ఆదివారం ఆ కొరత కాస్త తీరింది. రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షం పడింది. వానజల్లుకు తడిచి ముద్దవుతున్న అన్నదాతకు ఆక్రోశమే మిగిలింది. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారి మొదలు.. వారూ వీరు అన్న సంబంధం లేకుండా పడిన పిడుగులకు బలయ్యారు.

వర్షం ప్రారంభం కావటం.. ఒక్కసారిగా విపరీతమైన ఉరుములు.. మెరుపులతో పాటు పిడుగులు పడటంతో ఒక్క ఏపీలోనే మాయదారి పిడుగుల ధాటికి 22మంది చనిపోయారు. ఇక.. గుంటూరు నగర సమీపంలోని ఆంధ్ర క్రికెట్ స్టేడియం పక్కనే పిడుగు పడటంతో అందులో క్రికెట్ ఆడుతున్న ఏపీ.. త్రిపుర రాష్ట్రాల మహిళా క్రికెటర్లు వణికిపోయారు. మరోవైపు.. సోమవారం కూడా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని.. కొన్నిచోట్ల అయితే భారీగా వానలు పడే వీలుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా భారీగా పిడుగులు పడతాయని చెబుతున్నారు. ఉరుములు.. మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ఈ కారణంతో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ‘పిడుగుల వాన’ విషయంలో జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖం చాటేసిన వరుణుడు కాస్త పెద్ద మనసు చేసుకున్నాడనుకుంటే.. ఇప్పుడు ఈ పిడుగుల వానతో.. వర్షమంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చాడే.