Begin typing your search above and press return to search.

జైలులో రూ. 200 కోట్ల బెదిరింపు వసూళ్ల .. హైదరాబాద్ తో సంబంధమేంటి ?

By:  Tupaki Desk   |   15 Nov 2021 7:08 AM GMT
జైలులో రూ. 200 కోట్ల బెదిరింపు వసూళ్ల .. హైదరాబాద్ తో సంబంధమేంటి ?
X
దేశ రాజధాని ఢిల్లీ లోని రోహిణి జైల్‌ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.200 కోట్ల బెదిరింపు వసూళ్ల కేసు లింకులు సిటీ లో వెలుగులోకి వచ్చాయి. ఆ మొత్తం నుంచి కొంత హైదరాబా ద్‌లోని ఓ షెల్‌ కంపెనీకి బదిలీ అయినట్లు కేసుని విచారిస్తున్న అధికారులు గుర్తించడంతో ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ ఎకనమికల్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. దర్యాప్తులో భాగంగా ఆ కంపెనీ వ్యవహారాలను సేకరించడంతో పాటు నిర్వాహకులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఘరానా మోసగాడు, గ్యాంగ్‌ స్టర్‌ సుఖేష్‌ చంద్రశేఖర్‌ కొన్నాళ్లుగా అక్కడి రోహిణి జైల్‌లో ఖైదీగా ఉన్నాడు. ఇతడి అనుచరులు అవినాష్‌ కుమార్, జితేందర్‌ నారూలా కూడా అదే జైల్లో ఉన్నారు.

ఢిల్లీలోని రెలేగీ ఫైనాన్స్‌ సంస్థలో భాగస్వామి అయిన సుఖ్‌ వీర్‌ ను మోసం చేయడంతో పాటు ఆయన భార్య ఆదితిని బెదిరించిన ఆరోపణలపై వీళ్లు అరెస్టు అయ్యారు. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉండటంతో అక్కడి అధికారులతోనూ సుఖేష్‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. దీనితో ఇద్దరు అనుచరులతో కలిసి సుఖేష్‌ జైలు నుంచే దందా చేయడానికి పథకం వేశాడు. ఢిల్లీకి చెందిన వ్యాపారులను బెదిరించడం ద్వారా వసూళ్లకు పాల్పడాలని నిర్ణయించుకున్న ఈ త్రయం రంగంలోకి దిగింది. దీని కోసం సుఖేష్‌ తన ప్రియురాలు లీనా మారియా పౌల్‌ సహాయం తీసుకున్నాడు.

ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారుల వివరాలు సేకరించిన లీనా వాటిని ఎప్పటికప్పుడు సుఖేష్‌కు అందిస్తూ వచ్చింది. ములాఖత్‌ లో కలిసిన ప్రతి సందర్భంలోనూ వీళ్లు ఇదే విషయాలు చర్చించారు. ఎట్టకేలకు కరోల్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుటుంబాన్ని టార్గెట్‌ గా చేసుకున్నారు. ఆయనతో పాటు కుటుంబీకులు సైతం వ్యాపారులే కావడంతో సుఖేష్‌ భారీ మొత్తం వసూలు చేయాలని పథకం వేశాడు. వారిపై రెక్కీ నిర్వహించాల్సిన బాధ్యతలను బయట ఉన్న తన అనుచరులకు అప్పగించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏడుగురు ఆ పని పూర్తి చేసి ములాఖత్‌లో వివరాలు అందించారు. నైతిక మద్దతు ఇవ్వడం ద్వారా పరోక్షంగా, సెల్‌ ఫోన్లు అందించడం ద్వారా ప్రత్యక్షంగా రోహిణి జైల్‌కు చెందిన ఐదుగురు సుఖేష్‌ కు సహకరించారు.

బయట ఉన్న అనుచరుల ద్వారా టార్గెట్‌ చేసిన ఢిల్లీ వ్యాపారితో పాటు అతడి కుటుంబీకుల కదలికలు తెలుసుకుంటున్న సుఖేష్‌ వారికి ఫోన్లు చేయడం ద్వారా బెదిరింపులకు దిగాడు. ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం రెండు నెలల పాటు వారి నుంచి రూ.200 కోట్లు వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో తీసుకోకుండా అనేక షెల్‌ కంపెనీల్లోకి మళ్లించేలా చేశాడు. ఇందులో రూ.20 కోట్లను సుఖేష్‌ రోహిణి జైలు అధికారులకు పంచాడు. మిగిలింది షెల్‌ కంపెనీల ద్వారా తన అనుచరులకు చేరేలా చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఢిల్లీ ఈఓడబ్ల్యూ అధికారులు కేసు నమోదు చేశారు. సుఖేష్‌, లీనా సహా మొత్తం 11 మందిని అరెస్టు చేసి వారిపై చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేశారు. సోమవారం రోహిణి జైల్‌ అధికారులను అరెస్టు చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈఓడబ్ల్యూ అధికారులకు సుఖేష్‌ వసూలు చేసిన మొత్తం హాంగ్‌ కాంగ్‌ తో పాటు ముంబై, చెన్నై, హైదరాబాద్‌ ల్లో ఉన్న షెల్‌ కంపెనీలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ మొత్తంలో 7 శాతం కమీషన్‌ గా తీసుకున్నవాటి నిర్వాహకులు హవాలా రూపంలో డబ్బు సుఖేష్‌ చెప్పిన వారికి అందించినట్లు తేల్చారు. దీంతో ఆయా షెల్‌ కంపెనీల నిర్వాహకులు, హవాలా ఏజెంట్లను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. హైదరాబాద్‌ కు చెందిన కంపెనీ సనత్‌ నగర్‌ చిరునామాతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఆ సంస్థ గుట్టు రట్టు చేయడానికి అధికారులు కసరత్తులు ప్రారంభించారు.