Begin typing your search above and press return to search.

179 మందికి ప్రాణాంత‌క వైర‌స్‌...భార‌త్‌ లో కొత్త క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   26 Jan 2020 6:56 AM GMT
179 మందికి ప్రాణాంత‌క వైర‌స్‌...భార‌త్‌ లో కొత్త క‌ల‌క‌లం
X
పొరుగుదేశం చైనాను వ‌ణికిస్తున్న భార‌త్‌ లో సైతం క‌ల‌క‌లం రేపుతోంది. చైనాలో కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ 41 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ వ్యాధి అదుపులోకి వచ్చే పరిస్థితులు ఏమాత్రం కనిపించకపోగా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. మహారాష్ట్ర - కేరళల్లో 179 మంది ఈ వైరస్ బారిన పడినట్టుగా అనుమానిస్తున్నారు. వారందర్నీ ఆసుప్రతుల్లో ఉంచి - పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనా నుంచి భారత్‌కు ఈ వైర‌స్ వ్యాప్తి విష‌యంలో... కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వైద్య ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితుల గురించి సమీక్ష జరిపారు. దీనికి సంబంధించి ఏడు బృందాలను ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసిన రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.

చైనా నుంచి వచ్చిన 179 మంది విష‌యంలో వైర‌స్ అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేరళ వైద్య - ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పందించింది. వారిని వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచి పరీక్షలను నిర్వహిస్తున్నామని - దీనికోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామని వెల్లడించింది. కాగా, ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తూ వైరస్‌ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఢిల్లీ - ముంబయి - చెన్నై - కోల్‌ కతా - బెంగళూరు - హైదరాబాద్‌ - కొచ్చి ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. నేపాల్‌ - ఉత్తరాఖండ్‌ సరిహద్దులో థర్మల్‌ స్క్రీనింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రమంత్రి ప్రధాని మోదీని కలిసి కరోనా పరిస్థితుల గురించి వివరించారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రితోను ఆయన మాట్లాడారు.

భారత్‌లో ఇంతవరకు కరోనా బాధితులెవరినీ గుర్తించనప్పటికీ చైనా నుంచి తాజాగా వచ్చిన ఏడుగురిని కేరళలోని ఓ వైద్య కేంద్రానికి పంపించారు. ఈ సంవత్సరం చైనాకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజల సౌకర్యార్థం 24 గంటలు పనిచేసేలా 91-11-23978046 హెల్ప్‌ లైన్‌ నంబర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ భారత్‌ లో విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయం సమీక్షించింది. మ‌రోవైపు, వుహాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం పట్ల భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 700 మంది విద్యార్థులు వుహాన్‌ తోపాటు హుబెయి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో చదువుకొంటున్నారు.

కాగా,చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ చైనాలోనే కాకుండా హాంకాంగ్‌ - మకావు - తైవాన్‌ - నేపాల్‌ - జపాన్‌ - సింగపూర్‌ - దక్షిణ కొరియా - థాయ్‌ లాండ్‌ - వియత్నాం - అమెరికా వరకు విస్తరించింది. వైరస్‌ బారిన పడిన బాధితుల కోసం ఇప్పటికే ఒక కొత్త ఆస్ప‌త్రి నిర్మాణాన్ని ప్రారంభించిన చైనా - మరో 15 రోజుల్లో రెండో ఆస్ప‌త్రి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.