Begin typing your search above and press return to search.

రోడ్డు ప్రమాదాలతో గంటకు అంతమంది చనిపోతున్నారు

By:  Tupaki Desk   |   10 Jun 2016 6:27 AM GMT
రోడ్డు ప్రమాదాలతో గంటకు అంతమంది చనిపోతున్నారు
X
హ్యాపీగా మీరో సినిమా చూసి బయటకు వచ్చే సమయానికి దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయే వారెంతమందో తెలుసా.. దాదాపు 50 మందికి పైనే. ఒక గంట సేపు మీరు కాలం గడిపే సమయానికి 17 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితి. ఇదంతా కూడా కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగానే. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్న వారి సరాసరి తీసి.. గంటల చొప్పున లెక్కిస్తే గుండెలు అదిరిపోయే నిజాలు బయటకు వచ్చాయి.

మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. నిబంధనలు పాటించకపోవటం.. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం లాంటి మానవ తప్పిదాలతోనే ఇన్ని మరణాలు చోటు చేసుకోవటం గమనార్హం. దేశంలోని రహదారులు ఎంతలా రక్తమోడుతున్న విషయాన్ని తెలిపే నివేదికను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. 2015 సంవత్సరానికి సంబంధించిన ఈ నివేదిక వెల్లడించిన వాస్తవాలు షాకింగ్ గా ఉండటమే కాదు.. ఈ నివేదికను పైపైన చదివితేనే రోడ్డు మీదకు వెళ్లాలంటే వణుకు పుట్టేలా ఉండటం గమనార్హం. ఈ నివేదిక తయారు చేసిన ఏడాదికి ముందు ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు 2.5 శాతం పెరిగితే.. మరణాలు 4.6 శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు.

గంట వ్యవధిలో దేశ వ్యాప్తంగా 57 ప్రమాదాలు జరుగుతుంటే 17 మంది మరణిస్తున్నారు. మరింత ఆందోళ కలిగించే అంశాలేమంటే.. ప్రమాదాల్లో నగరాలు.. పట్టణాలను గ్రామాలు మించిపోవటం ఒకటైతే.. ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం టూవీలర్స్ కారణంగా చోటు చేసుకుంటున్న యాక్సిండెట్లేనని చెబుతున్నారు. దేశం జరుగుతున్న ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి జాబితాను తయారు చేస్తే.. ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో నిలిస్తే తెలంగాణ 10వ స్థానంలో నిలవటం గమనార్హం. ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న సమయాన్ని చూస్తే సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే ఎక్కువని తేలింది.

రోడ్డు ప్రమాదాలు.. మృతులకు సంబంధించి నివేదికలో పేర్కొన్న మరికొన్ని అంశాల్ని పరిశీలిస్తే.. గత ఏడాది మరణించిన వారిలో 51 శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల లోపు వారే కావటం గమనార్హం. ప్రమాదాలకు కారణం డ్రైవర్లే ప్రధాన కారణంగా తింది. అతి వేగం కారణంగా 62 శాతం ప్రమాదాలు జరిగితే.. మద్యం.. డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేయటం కారణంగా మొత్తం మరణాల్లో 6 శాతం ఈ కారణం వల్ల జరిగాయి. 11 శాతం మరణాలకు హిట్ అండ్ రన్ కారణమైతే.. ఓవర్ లోడ్ కారణంగా 25,199 మంది మరణించటం గమనార్హం. మొత్తం ప్రమాదాల్లో 86 శాతం 13 రాష్ట్రాల్లోనే చోటు చేసుకోవటం విశేషం. ఈ 13 రాష్ట్రాల్లో దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాలు ఉండటం చూస్తే.. ఈ ప్రాంతాల్లోని వారి రిస్క్ రేటు ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ప్రమాదాలు అత్యధికంగా జరిగే 13 రాష్ట్రాలు ఏమిటంటే..

1. తమిళనాడు

2. మహారాష్ట్ర

3. మధ్యప్రదేశ్

4. కర్ణాటక

5. కేరళ

6. ఉత్తరప్రదేశ్

7. ఆంధ్రప్రదేశ్

8. రాజస్థాన్

9. గుజరాత్

10. తెలంగాణ

11. ఛత్తీస్ గఢ్

12. పశ్చిమ బెంగాల్

13. హర్యానా