Begin typing your search above and press return to search.

కోహ్లి టెస్టుల్లో కాలిడి 11 ఏళ్లు.. ముందుంది కష్ట కాలం

By:  Tupaki Desk   |   20 Jun 2022 10:54 AM GMT
కోహ్లి టెస్టుల్లో కాలిడి 11 ఏళ్లు.. ముందుంది కష్ట కాలం
X
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ లోకి కాలుపెట్టి సోమవారంతో 11 ఏళ్లు పూర్తయింది. కోహ్లి.. 22వ ఏట సంప్రదాయ ఫార్మాట్ లో బరిలో దిగాడు. ఇప్పటివరకు 101 టెస్టులు ఆడిన అతడు 171 ఇన్నింగ్స్ లో 8,043 పరుగులు చేశాడు. 254 నాటౌట్.. అతడి అత్యధిక స్కోరు. సగటు 49.95. సెంచరీలు 27 కాగా.. 28 అర్ధ సెంచరీలు చేశాడు.

వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్ లో జరిగే ఓ టెస్టు మ్యాచ్ లో కోహ్లి బరిలో దిగనున్నాడు. ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి విరామం పొందిన అతడ.. ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉన్నాడు. కాగా, టెస్టుల కంటే మూడేళ్ల ముందే కోహ్లి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2008 ఆగస్టు 18న శ్రీలంక టూర్ తో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. 2010 జూన్ లో టి20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 260 వన్డేలాడిన కోహ్లి 251 ఇన్నింగ్స్ లో 12,311 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 183. సగటు 58.07. 43 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు కొట్టాడు. 97 టి20ల్లో 89 ఇన్నింగ్స్ లాడి 3,296 పరుగులు చేశాడు. 51.50 సగటు. 94 అత్యధిక స్కోరు.

సెంచరీ కొట్టి దాదాపు మూడేళ్లు

కోహ్లి వయసు ప్రస్తుతం 33 ఏళ్ల 227 రోజులు. వాస్తవానికి ఈ వయసులో బ్యాట్స్ మన్ పరిపూర్ణతతో బ్యాటింగ్ చేయాలి. కానీ, దీనికి ఐదేళ్ల ముందే కోహ్లి ఆ మార్క్ ను అందుకున్నాడు. ఇక అతడు కొత్త మైలురాళ్లను నెలకొల్పాలి. కానీ, కోహ్లి పూర్తిగా తడబడుతున్నాడు. క్రీజులో నిలవలేకపోతున్నాడు. ఇటీవలి ఐపీఎల్-15వ సీజన్ నే చూస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లి పేలవ ఫామ్ తెలిసిపోతోంది. గోల్డెన్ డక్ లు సహా అతడు పరుగులు సాధించడానికి ఇబ్బందిపడిన మ్యాచ్ లెన్నో..? ఇక కోహ్లి సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. 2019 నవంబరులో కోహ్లి బంగ్లాదేశ్ పై గులాబీ టెస్టులో శతకం చేశాడు. మళ్లీ ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు. మూడంకెలు కాదు కదా..? కనీసం అర్ధ సెంచరీ చేసినా చాలనేలా ఉంది అతడి బ్యాటింగ్ స్థాయి.

కెప్టెన్సీలన్నీ వదులుకున్నా...

ఐపీఎల్ జట్టు సహా.. టీమిండియా టెస్టు, వన్డే, టి20 కెప్టెన్సీలన్నింటినీ కోహ్లి వదులుకున్నాడు. అంటే అతడిప్పుడు సాధారణ బ్యాట్స్ మన్. ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఉంది. కానీ, ఇదేమీ కోహ్లిని తాజాగా ఉంచలేకపోతోంది. ఇప్పటికీ అతడు కెప్టెన్సీ భారపు ఛాయల నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఒకవేళ కెప్టెన్సీ భారమే లేకుంటే.. కోహ్లి ఇప్పటికే భారీ స్కోర్లు చేసి ఉండాల్సింది. గత 6 నెలల్లో దేనిలోనూ అతడు నిలకడగా ఆడింది లేదు.

మేల్కోకుంటే అంతే..

ఫిట్ నెస్ కు మారుపేరుగా.. పోరాటతత్వానికి ప్రతీకగా నిలిచే కోహ్లి ఫామ్ మెరుగుపర్చుకోకుంటే జట్టులో చోటు కష్టమే. ఇప్పటికిప్పుడు కాకున్నా.. వచ్చే ఏడాది కాలంలో అయినా అతడు భారీగా పరుగులు సాధించాలి. యువ క్రికెటర్ల నుంచి కోహ్లికి ఆ స్థాయిలో పోటీ ఉంది. గతేడాది వరకు టీమిండియా టెస్టు మూల స్తంభాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. గత సిరీస్ కు జట్టులో చోటు కోల్పోయారు. పుజారా ఇంగ్లండ్ లో రాణించి మళ్లీ జట్టులోకి వచ్చాడు. రహానే కథ ఇక అంతే అన్నట్లుంది. కోహ్లికీ ఈ పరిస్థితి రాదని చెప్పలేం. అయితే.. కోహ్లి స్థాయి ఆటగాడికి అలాంటి అనుభవం రాకూడదని మనం కోరుకోవాలి. కాగా, ఇప్పుడు ఐపీఎల్ కూడా ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. సరికొత్తగా ఆటను మొదలుపెట్టే అవకాశం కోహ్లికి ఉంది. చూద్దాం.. మరి మన పాత కోహ్లి కనిపిస్తాడేమో..?

తొలి టెస్టు లో కోచ్ ద్రవిడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

కోహ్లి తొలి టెస్టును వెస్టిండీస్ పై ఆడాడు. కింగ్ స్టన్ లో జరిగిన ఆ టెస్టులో భారత్ 63 పరుగులతో గెలిచింది. కోహ్లి 5వ నంబరు బ్యాట్స్ మన్ గా బరిలో దిగి తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 15 పరుగులకు ఔటయ్యాడు. ఇదే మ్యాచ్ లో ప్రవీణ్ కుమార్, కోహ్లి అండర్ 19 సహచరుడు అభినవ్ ముకుంద్ టెస్టు అరంగేట్రం చేశారు. ప్రవీణ్ కుమార్ రెండు ఇన్నింగ్స్ ల్లో 6 వికెట్లు (3+3) పడగొట్టి ఆక్టుకున్నా అతడి కెరీర్ మధ్యలోనే ముగిసింది. 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టి20లు మాత్రమే ఆడాడు. అభినవ్ ముకుంద్ భారత్ కు 7 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి కనుమరుగయ్యాడు. విశేషమేమంటే.. కోహ్లి నాడు తొలి టెస్టు ఆడిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ .. ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్. తొలి ఇన్నింగ్స్ లో 40, రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులు చేసిన ద్రవిడ్.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.