Begin typing your search above and press return to search.

కర్నూలులో కరోనా కలవరం..బస్సు ఆస్పత్రికి తరలింపు

By:  Tupaki Desk   |   20 March 2020 9:10 AM GMT
కర్నూలులో కరోనా కలవరం..బస్సు ఆస్పత్రికి తరలింపు
X
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మెల్లగా విస్తరిస్తూ తీవ్రమవుతోంది. ఇప్పటికే తెలంగాణలో 16 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యి. అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కరోనా లక్షణాలు కనిపించాయని ఓ బస్సును ఏకంగా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో కలవరం రేపుతోంది.

కర్నూలు జిల్లా వెల్దుర్తి మీదుగా ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు ఏపీ02 జెడ్ 0507 ప్రయాణికులతో వెళ్తోంది. అయితే కరోనా లక్షణాలు ఉన్నాయని పలువురు అనుమానించారు. దీంతో వెల్దుర్తి వద్ద బస్సును ఆపివేసిన ప్రయాణికులు అటు నుంచి బస్సుతో సహా 11 మందిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణించిన వారందరినీ ఐసోల్యూషన్ వార్డుకు తరలించారని సమాచారం. కరోనా లక్షణాలతో కొందరు కనిపించడంతో ప్రయాణికులతో పాటు డ్రైవర్ కండక్టర్ గుర్తించి ప్రయాణికులతో సహా ఆస్పత్రికి వెళ్లారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ బస్సులో ప్రయాణించిన వారి వివరాలు సేకరించి వారిని పరిక్షించే అవకాశం ఉంది.

అయితే కరోనా ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బులిటెన్ విడుదల చేసింది. కరోనా వైరస్‌ బారిన పడిన ప్రకాశం, నెల్లూరుకు చెందిన వ్యక్తులు కోలుకుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. కరోనాపై ఎలాంటి మరణం లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జనతా కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.