Begin typing your search above and press return to search.

చిత్రం చెప్పిన కథ: 100ఏళ్ల క్రితం తెలంగాణ!

By:  Tupaki Desk   |   18 Aug 2016 5:34 AM GMT
చిత్రం చెప్పిన కథ: 100ఏళ్ల క్రితం తెలంగాణ!
X
వందేళ్ల నాటి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజల జీవనం - నిజాం దర్పం - ఈ ప్రాంతాల రూపురేఖలు - నాటి కట్టడాల సొగసు - ఒకటేమిటి.. ఎన్నో అద్భుతమైన సుమారు 4,800 ఛాయా చిత్రాల ఖజానా ఒకటి తెలంగాణ పురావస్తు శాఖలో నిక్షిప్తమై ఉంది. అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్ట్ర - ఒరిస్సా - కర్ణాటక - మధ్యప్రదేశ్‌ లలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కూడా లేకపోవడంతో.. వాటి కోసం ఆ ప్రభుత్వాలు అన్వేషిస్తున్నాయి. ఈ తరుణంలో అలాంటి అరుదైన ఫొటోల ఖజానా తెలంగాణ పురావస్తు శాఖలో ఉండటం ఆసక్తిని రేపుతుంది. కొన్ని దశాబ్దాలుగా స్టోర్‌ రూమ్‌ లో మగ్గిన ఆ చిత్రాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దుమ్ముదులిపి వెలుగులోకి తెస్తోంది.

ప్రపంచ దిగ్గజ ఫోటోగ్రాఫర్ గా ఖ్యాతి గడించిన రాజా దీన దయాళ్ అప్పట్లో నిజాం ఆస్థాన ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ఎన్నో అద్భుతమైన ఛాయాచిత్రాలను తన కేమేరాలో బందించారు. అయితే ఆ ఫోటోలకు సంబందించిన గ్లాస్ నెగెటివ్స్ ప్రస్తుతం తెలంగాణ పురావస్తు శాఖ స్టోర్ రూం లో ఉన్నాయి. వందేళ్ల నాటి నెగెటివ్స్ ఇప్పుడు డెవలప్ చేస్తే ఫోటోలు ఎలా ఉంటాయో అని అనుకునేరు... ఆ గ్లాస్ నెగెటివ్స్ ని ఇన్ని దశాబ్ధాల తర్వాత ఇప్పుడు డెవలప్ చేస్తే.. అద్భుతమైన స్పష్టి తో కూడిన చిత్రాలు వచ్చాయి. దీంతో అవాకవ్వడం అధికారుల వంతయ్యింది. ఇవి తొలితరం ఫీల్డ్ కెమెరాతో తీసిన గ్లాస్ నెగెటివ్స్.

ఈ అద్భుతమైన ఫోటోలను ప్రజలకు సైతం చూపించాలని నిర్ణయించిన అధికారులు అందుకు సరైన సమయంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఎంచుకున్నారు. దీంతో ఈ నెల 19న వైఎస్సార్ స్టేట్ మ్యూజియంలో ఈ చిత్రాలను ప్రదర్శనకు ఉంచనున్నారు. కాగా గతంలో అలనాటి పురాతన ఫీల్డ్ కెమెరాలు - వాటి పరికరాలను తుక్కు కింద భావించి వేలంపాటలో అమ్మేసి ఘనత మన పురావస్తు శాఖ అధికారులకు చెందడం గమనార్హం. దాంతో ఈ ప్రదర్శన్లో ఒక్క ఫోటోలను మాత్రమే పరదర్శనకు ఉంచుతున్నారు.