Begin typing your search above and press return to search.

100 కోట్ల వ్యాక్సిన్లు .. వ్యాక్సినేషన్‌ లో భారత్ సరికొత్త రికార్డ్

By:  Tupaki Desk   |   21 Oct 2021 12:30 PM GMT
100 కోట్ల వ్యాక్సిన్లు .. వ్యాక్సినేషన్‌ లో భారత్ సరికొత్త రికార్డ్
X
కరోనా వ్యాక్సినేషన్‌ లో భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాల పంపిణీలో సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ రోజు ఉదయ నాటికి మనదేశంలో 100 కోట్ల డోస్‌ల టీకాలు వేశారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ తోనే ఈ విజయం సాధ్యమయిందని మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. 100 కోట్ల వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. 100 కోట్ల వ్యాక్సినేషన్‌ పై షార్ట్ ఫిలింతో పాటు స్పెషల్ సాంగ్‌ ను రూపొందించారు.

ఈ రోజు ఎర్రకోట వీటిని విడుదల చేయనున్నారు. భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ ల మైలు రాయిని అందుకున్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేసియా విభాగం ప్రత్యేకంగా అభినందించింది. తక్కువ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్‌ లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని డబ్ల్యూహెచ్‌ వో ఈగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు. 100 కోట్ల వ్యాక్సినేషన్‌ ను ఘనంగా జరుపుకునేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 100 వారసత్వ కట్టడాలపై భారత జాతీయ పతాకంలోని మూడు రంగులతో లైటింగ్ ఏర్పాటు చేశారు.

కరోనా మహమ్మారి పై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల సేవల కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన దేశంలో జనవరి 16న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. మొదటి దశలో కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి రెండో దశ ప్రారంభమయింది. రెండో దశలో 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ వేయడం ప్రారంభించారు. అనంతరం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్ ప్రారంభమైన మొదటి రోజుల్లో కొన్ని రకాల భయాలు, అపోహలతో టీకా పంపిణీ నెమ్మదిగా సాగింది.

కానీ రెండో దశ కరోనా విజృంభించిన తర్వాత వ్యాక్సినేషన్ ఊపందుకుంది. జూన్ నెలాఖరులో రోజుకు 40 లక్షల టీకాలు వేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17న ఏకంగా 2.50 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. మొత్తంగా 9 నెలల్లోనే 100 కోట్ల డోస్‌ల మార్క్‌ను అధిగమించింది. ఈ ఏడాది జూన్ 12న‌ 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న‌ 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింది. నేటితో 100 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింద‌ని కొవిన్ పోర్ట‌ల్‌లో పేర్కొన్నారు. మొద‌ట వ్యాక్సిన్లు వేయించుకునేందుకు భ‌య‌ప‌డ్డ ప్ర‌జ‌లు అనంత‌రం భారీగా టీకా కేంద్రాల‌కు త‌ర‌లివెళ్లి వేయించుకోవ‌డం కీలక మలుపుగా చెప్పవచ్చు.