Begin typing your search above and press return to search.

ముగ్గురు తెలుగోళ్లు.. అమెరికాలో చేసిన ఆరాచకం తెలిస్తే షాకే

ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించటం.. బానిస కంటే దారుణంగా ట్రీట్ చేయటం.. ఈ వేధింపులు ఏకంగా ఏడు నెలలుగా సాగుతుండటం చూస్తే.. ఇదెక్కడి పైశాచికత్వం అనుకోకుండా ఉండలేం.

By:  Tupaki Desk   |   1 Dec 2023 6:17 AM GMT
ముగ్గురు తెలుగోళ్లు.. అమెరికాలో చేసిన ఆరాచకం తెలిస్తే షాకే
X

అగ్రరాజ్యం అమెరికాలో ఒక దారుణ ఉదంతం వెలుగు చూసింది. ఒళ్ల జలదరింపే కాదు.. వికారం కలిగించే ఈ దారుణానికి పాల్పడింది ముగ్గురు తెలుగువారుగా చెబుతున్నారు. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించటం.. బానిస కంటే దారుణంగా ట్రీట్ చేయటం.. ఈ వేధింపులు ఏకంగా ఏడు నెలలుగా సాగుతుండటం చూస్తే.. ఇదెక్కడి పైశాచికత్వం అనుకోకుండా ఉండలేం. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగర పరిధిలోని ఒక రెస్టారెంట్ కు స్థానిక వ్యక్తి ఒకరు వెళ్లారు. అతడికి బాధిత యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో.. ఆ వ్యక్తి కాస్త చొరవ తీసుకొని బాధిత వ్యక్తి వద్దకు వెళ్లి కలిసి.. ఏదైనా సమస్య ఉంటే తనకు తెలియజేయాలని కోరాడు. అవసరమైతే ఫోన్ చేయాలని చెబుతూ.. తన ఫోన్ నెంబరు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి.. బాధిత వ్యక్తి నుంచి ఫోన్ తో పాటు.. వాట్సాప్ లో తాను ఎదుర్కొంటున్న నరకాన్ని తెలియజేశాడు. తనను ముగ్గరు నరరూప రాక్షసులు ఏడునెలలుగా నరకాన్ని చూపిస్తున్న వైనాన్ని చెప్పుకున్నాడు.

ఆ ముగ్గురు తనను బంధించి తీవ్రంగా హింసిస్తున్నట్లుగా తెలియజేశాడు. తనను శారీరకంగా.. మానసికంగా హింసిస్తున్న ముగ్గురి పేర్లను తెలియజేశాడు. ఈ ముగ్గరు తెలుగువాళ్లే కావటం గమనార్హం. వీరి పైశాచికత్వం గురించి తెలుసుకున్న సదరుస్థానిక వ్యక్తి షాక్ తిని.. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత వ్యక్తిని ఉంచిన ఇంటికి వెళ్లారు. అయితే.. పోలీసుల్ని ఇంట్లోకి రానిచ్చేందుకు ప్రధాన నిందితుడు అతని సహచరులు ఒప్పుకోలేదు. దీంతో.. బాధితుడే తనంతట తానే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి తనను రక్షించాలని పోలీసుల్ని వేడుకున్నాడు. దీంతో.. పోలీసులు అలెర్టు అయి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో బాధత వ్యక్తి నుంచి తెలుసుకున్న సమాచారంతో షాక్ తిన్నారు. 2023 ఏప్రిల్ నుంచి దాదాపు ఏడు నెలలకు పైనే తనను ముగ్గురు తీవ్రంగా హింసించేవారని వాపోయాడు. ప్రతిరోజు పీవీసీ పైపులు.. ఇనుప రాడ్లు.. విద్యుత్ వైర్లతో చావబాదేవారని.. అలా బాధితుడ్ని కొడుతుంటే.. దెబ్బలకు తాళలేక విలవిలాడుతుంటే చూస్తూ ఆనందించేవారని వెల్లడైంది. నిందితుల రాక్షసకాండతో బాధితుడి తల నుంచి కాలి వరకు అతడి శరీరంలోని ప్రతి భాగంంలోనూ దెబ్బలు.. గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఏడు నెలల వ్యవధిలో 30కేజీల మేర బరువు తగ్గిన వైనాన్ని తెలుసుకొని విస్మయానికి గురయ్యే పరిస్థితి.

20 ఏళ్ల బాధిత వ్యక్తి అమెరికాకు ఎలా వచ్చాడు?ఎవరు తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. బాధిత వ్యక్తి చేత ఇంట్లో పని మొత్తం చేయించటంతో పాటు.. ప్రధాన నిందితుడు ప్రతి రోజూ రెండు గంటల పాటు మసాజ్ చేయించుకునేవాడని తేలింది. వారు చెప్పినట్లుగా పనులు చేయకపోతే.. తీవ్రంగా హింసించేవారు. రోజులో మూడు గంటల పాటు మాత్రమే నిద్రపోయేందుకు అవకాశం ఇచ్చేవారని.. బేస్ మెంట్ లో పడుకునేందుకు అనుమతి ఇచ్చేవారని తేలింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రధాన నిందితుడు ఇంట్లో లేనప్పుడు.. మిగిలిన ఇద్దరు ఇంటికి వచ్చి అతడిపై శారీరక దాడికి పాల్పడి.. అదంతా సీసీ కెమేరాల ద్వారా లైవ్ లో చూపించేవారని తేలింది. నిందితుల చర్యలతో తీవ్రంగా నీరసించిపోయిన బాధితుడ్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఉదంతం బయటకు రావటంతో భారతీయ ఎన్ఆర్ఐలు షాక్ తింటున్న పరిస్థితి. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా ఉన్నట్లుగా చెబుతున్నారు.