Begin typing your search above and press return to search.

‘డల్లాస్’పురంలో కోడిపందేలు.. ‘మనోళ్లు’ ఏం చేసినా వైరలే

ఆంధ్రాలో కోడిపందేలు కామన్. సంక్రాంతి వచ్చిందంటే నేతలు, ప్రజలు ఈ కోడిపందేలు ఘనంగా నిర్వహించి తమ ముచ్చట తీర్చుకుంటారు.

By:  Tupaki Desk   |   19 May 2025 9:00 AM IST
‘డల్లాస్’పురంలో కోడిపందేలు.. ‘మనోళ్లు’ ఏం చేసినా వైరలే
X

రోమ్ లో రోమన్ లా ఉండలన్నది సామెత.. ఇన్నాళ్లు అలానే ఉండేవారు. అమెరికాలో భారతీయులు పద్ధతిగా అమెరికన్ లాగానే కట్టుబొట్టుతో వ్యవహరించేవారు. అయితే ఇప్పుడొచ్చిన కొత్త జనరేషన్ అలా కాదు.. అమెరికాలోనూ ‘ఆంధ్రా’ సంస్కృతిని వ్యాపింపచేస్తున్నారు. అవును.. అమెరికాలోనూ మన వాళ్లు ఎక్కువగా ఉండే డల్లాస్ లో కోడిపందేలు గతంలో నిర్వహించారు. అందుకు గాను దాదాపు 21 మంది ప్రవాస తెలుగువారు, భారతీయులను అరెస్ట్ చేశారు. 65 కోళ్లను కాపాడారు. మనోళ్ల సరదా అమెరికాలోనూ చిక్కులు తెచ్చిపెడుతోంది. అరెస్ట్ లు చేయిస్తోంది. గత నెలలో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆంధ్రాలో కోడిపందేలు కామన్. సంక్రాంతి వచ్చిందంటే నేతలు, ప్రజలు ఈ కోడిపందేలు ఘనంగా నిర్వహించి తమ ముచ్చట తీర్చుకుంటారు. బోలెడంత బెట్టింగులు కాస్తారు. అయితే ఆంధ్రాలో కాదు.. ఇప్పుడు అమెరికాలో గత నెలలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడం కలకలం రేపింది.. తూర్పు టెక్సాస్‌లోని హంట్ కౌంటీలో మార్చి 31న ఈ ఘటన చోటుచేసుకుంది. సెలెస్టే ప్రాంతంలో జరుగుతున్న కోడి పందేల స్థావరంపై షెరీఫ్‌లు మెరుపుదాడి చేసి 21 మందిని అరెస్టు చేయగా, 65 సజీవ కోళ్లను రక్షించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


పందేలలో ఉపయోగించే పదునైన బ్లేడ్‌లు (గాఫ్‌లు) వల్ల తీవ్రంగా గాయపడిన 10 కోళ్లు అప్పటికే మరణించాయి. రక్షించిన 65 కోళ్లను డల్లాస్‌లోని SPCA ఆఫ్ టెక్సాస్‌కు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.ఈ కోడిపందేలలో సుమారు వంద మంది పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కోడిపందేలు స్థానిక చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. వీటికి పాల్పడిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తారు. పోలీసుల ఆకస్మిక దాడితో చాలా మంది పందెం రాయుళ్లు అక్కడి నుంచి పరుగులు తీసినప్పటికీ, పోలీసులు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిని హంట్ కౌంటీ షెరీఫ్‌ల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్, SPCA ఆఫ్ టెక్సాస్ సంయుక్తంగా నిర్వహించాయి.రక్షించిన కోళ్లలో 12 కోళ్లు తీవ్ర గాయాలతో బతకలేని స్థితిలో ఉండటంతో పశువైద్యుడు వాటిని కారుణ్య మరణం చెందించారు. టెక్సాస్‌తో సహా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ కోడిపందేలు దశాబ్దాలుగా చట్టవిరుద్ధమే. అయినప్పటికీ అనేక గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇవి రహస్యంగా కొనసాగుతూనే ఉన్నాయి.టెక్సాస్ చట్టాల ప్రకారం, కోడిపందేలు నిర్వహిస్తూ పట్టుబడిన వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు.

ఈ ఘటన అమెరికాలో అక్రమంగా జరుగుతున్న కోడిపందేల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇందులో మన ఆంధ్రా తెలుగు వారే పాల్గొనడంతో మనవాళ్లు అమెరికా వెళ్లినా ఈ ఆటలు ఆడకుండా మానడం లేదని అర్థమవుతోంది. అమెరికాలో జంతువులను హింసించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.