Begin typing your search above and press return to search.

యూఎస్ లో తెలుగమ్మాయి యాక్సిడెంట్ లో మృతి... వీడియోలో ఉన్నదిదే!

ఆ అమ్మాయి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఇప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో కీలకంగా మారింది!

By:  Tupaki Desk   |   24 July 2023 2:57 PM GMT
యూఎస్  లో తెలుగమ్మాయి యాక్సిడెంట్ లో మృతి... వీడియోలో ఉన్నదిదే!
X

ఈ ఏడాది జనవరి లో అమెరికా లోని సీటెల్ నగరం లో పోలీస్ వాహనం ఢీకొట్టి కందుల జాహ్నవి అనే తెలుగు అమ్మాయి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ అమ్మాయి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఇప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో కీలకంగా మారింది!

అవును... నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్‌ లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది జాహ్నవి. ఈ క్రమంలో జనవరి 23న ఆమె రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం దూసుకొచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈ సమయంలో వాహనం లో సీటెల్‌ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ ఉన్నాడు.

అతని బాడీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి కెవిన్ స్పీడో మీటర్ గంటకు 74 మైళ్ల వేగాన్ని చూపుతోంది. ఆ సమయంలో జాహ్నవి ని డెక్స్‌ టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ కూడలి వద్ద కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు, పోలీస్ అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్‌ కు తరలించారు.

అనంతరం అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటన జరిగిన సమయం లో కెవిన్ ఓ ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. దీని కారణం చేత వాహనం సైరన్‌ ను ఆయన తగ్గించాడు. కానీ అత్యవసర పరిస్థితి గురించి హెచ్చరించడంలో కెవిన్ విఫలమయ్యాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. బాడీ క్యామ్ ఫుటేజ్‌ లో జాహ్నవికి సీపీఆర్ నిర్వహించడాన్ని చూడవచ్చు.

దీని పై కెవిన్ మాట్లాడుతూ... తాను సైరన్ మోగిస్తూ వస్తున్నానని, ఆ సమయం లో జాహ్నవి క్రాస్‌ వాక్‌ లో వుందని చెప్పారు. తనను చూసి క్రాస్ వాక్ గుండా పరిగెత్తిందని కెవిన్ తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన దాదాపు ఆరు నెలల తర్వాత పోలీసులు ధరించిన బాడీ క్యామ్‌ లో రికార్డ్ అయిన ఘటన దృశ్యాలు వెలుగుచూశాయి.

కాగా... కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి సీటెల్‌ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు. జనవరి 23న కళాశాలకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

జాహ్నవి భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం అండగా నిలిచింది. జనవరి 29న ఎమిరేట్స్ ఎయిర్‌ లైన్స్ విమానంలో మృతదేహాన్ని హైదరాబాద్‌ కు పంపించారు. అక్కడి నుంచి ఆదోనీకి పంపారు. అలాగే జాహ్నవి కుటుంబానికి అండగా నిలిచేందుకు గాను ఆమె స్నేహితులు "గో ఫండ్ మీ" ద్వారా నిధుల సమీకరణ చేపట్టారు.