Begin typing your search above and press return to search.

'వ్యూహం' మ‌ళ్లీ వాయిదా.. కోర్టులో చుక్కెదురు!

ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ప‌లు వివాదాస్ప‌ద అంశాల కార‌ణంగా ప‌దే ప‌దే వాయిదా ప‌డుతోంది.

By:  Tupaki Desk   |   29 Dec 2023 4:48 AM GMT
వ్యూహం మ‌ళ్లీ వాయిదా.. కోర్టులో చుక్కెదురు!
X

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్ర విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. సి.బి.ఎఫ్.సి జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ న్యాయ‌మ‌ర్తి ఆదేశాలు జారీ చేసారు. తదుపరి విచారణ జనవరి 11కు వాయిదా వేసింది. దీంతో మ‌రోసారి ఆర్జీవీ వ్యూహానికి బ్రేక్ ప‌డింది.

ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ప‌లు వివాదాస్ప‌ద అంశాల కార‌ణంగా ప‌దే ప‌దే వాయిదా ప‌డుతోంది. ఇప్పుడు `వ్యూహం`కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా, దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పార్టీ జెండాలు, నేతల పేర్లతో చిత్రం తీశారని, ఇది పలు పార్టీల నేతల పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది మురళీధర్‌రావు వాదించారు.

దర్శ‌క‌నిర్మాత‌ల త‌ర‌పున‌ సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 'రిట్ పిటిషన్ మెయింటెనబుల్ కాదు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్ష‌న్‌ 29(ఏ) ప్రకారం ఈ పిటిషన్‌ వేసే అర్హత పిటిషనర్‌కు లేదు. ఎవరి పరువుకు నష్టం కలుగుతుందని భావిస్తే.. వారే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. చిత్రం చూడకుండానే పరువుకు నష్టం వాటిల్లుతుందని.. ఊహించి పిటిషన్‌ వేయడం ఆక్షేపణీయం. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంపై కొందరు ఇదే హైకోర్టును ఆశ్రయించగా, చిత్రం చూడకుండానే ఆరోపణలు చేయడం సరికాదంటూ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తొమ్మిది మందితో కూడిన కమిటీ కూర్చొని చిత్రాన్ని చూసి ఏకగ్రీవంగా సర్టిఫికెట్‌ జారీ చేసారు. వ్యక్తులను, పార్టీలను కించపరిచే విధంగా ఉంటే సివిల్ కోర్టులో వారు పరువు నష్టం దావా వేసుకోవాలి. హైకోర్టులో వేయడం తప్పుబట్టాల్సిన అంశం. పిటిషన్‌ను కొట్టివేయాలి`` అని విజ్ఞప్తి చేశారు.

అనంతరం సీబీఎఫ్‌సీ తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) వాదనలు వినిపిస్తూ.. సినిమాటోగ్రాఫ్ చట్టం, ఫిల్మ్ సర్టిఫికేషన్ మార్గదర్శకాలు, ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం భావ ప్రకటన హక్కును పరిగణనలోకి తీసుకుని రివైజింగ్ కమిటీ ఏకగ్రీవంగా `యు` సర్టిఫికెట్ మంజూరు చేసిందని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... సీ.బీ.ఎఫ్.సి జారీ చేసిన సర్టిఫికెట్ ను వచ్చే నెల 11 వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. తుది తీర్పు వెలువ‌డిన త‌ర్వాతే ఇక సినిమా రిలీజ్ చేయ‌డం సాధ్య‌మ‌వుతుంది.