Begin typing your search above and press return to search.

వారిని దేశ వ్యతిరేకులుగా ప్రకటించండి.. నెటిజన్ల డిమాండ్‌!

కాగా ఈ గ్యాంగ్‌ రేప్‌ వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌ లో ఈ దారుణం చోటు చేసుకుంది. జార్ఖండ్‌ లోని దుమ్కా జిల్లాలో తన భర్తతో కలిసి బైక్‌ పై టూరుకు వచ్చిన స్పెయిన్‌ పర్యాటకురాలిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది.

By:  Tupaki Desk   |   3 March 2024 1:49 PM GMT
వారిని దేశ వ్యతిరేకులుగా ప్రకటించండి.. నెటిజన్ల డిమాండ్‌!
X

వరల్డ్‌ టూరులో భాగంగా మనదేశాన్ని సందర్శించడానికి వచ్చిన స్పెయిన్‌ కు చెందిన మహిళపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిన సంగతి తెలిసిందే. భర్తతో కలిసి స్కూటర్‌ పై మనదేశంలో జార్ఖండ్‌ లో పర్యటిస్తున్న క్రమంలో ఆ మహిళ సామూహిక అత్యాచారానికి గురయింది. ఇప్పటికే నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధిత మహిళ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్ప్రతిలో కోలుకుంటోంది.

ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ ఘటనపై దుమ్మెత్తిపోశారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్‌ పుట్టినిల్లు అని, మనదేశంలో మహిళలను దేవతల్లా కొలుస్తారని.. అలాంటి దేశంలో ఇలాంటి అత్యాచారాలు జరగడం దారుణమని మండిపడ్డారు. చెడ్డ వ్యక్తుల వల్ల దేశం మొత్తానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రపంచ దేశాల్లో భారత్‌ తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటివి చేయడానికి మరొకరు భయపడేలా కఠిన శిక్షలు ఉండాలని కోరుతున్నారు.

ఈ అత్యాచార ఘటనపై న్యాయస్థానం వెంటనే ప్రత్యేక విచారణ జరపాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రత్యేక కేసుగా పరిగణించి విచారణ జరపాలని సూచిస్తున్నారు. నిందితులకు జీవిత కాల శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా వారిని దేశ వ్యతిరేకులుగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇలాంటి నేరస్తుల వల్ల అంతర్జాతీయ వేదికలపై భారత్‌ పరువు పోతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ గ్యాంగ్‌ రేప్‌ వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌ లో ఈ దారుణం చోటు చేసుకుంది. జార్ఖండ్‌ లోని దుమ్కా జిల్లాలో తన భర్తతో కలిసి బైక్‌ పై టూరుకు వచ్చిన స్పెయిన్‌ పర్యాటకురాలిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్పెయిన్‌ కు దంపతులు బైక్‌ పై మనదేశానికి వచ్చారు. ముందుగా బంగ్లాదేశ్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి జార్ఖండ్‌ లోని దుమ్కాకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి బిహార్‌ మీదుగా నేపాల్‌ కు వెళ్లాలని అనుకున్నారు.

ఈ క్రమంలో జార్ఖండ్‌ లోని దుమ్కాకు చేరుకున్నారు. చీకటి పడడంతో నిర్జన ప్రదేశంలో రాత్రి బస కోసం దంపతులు డేరా ఏర్పాటు చేసుకున్నారు. వీరిని ఒంటరిగా గమనించిన 10 మంది దుండగులు భర్తపై దాడికి దిగారు. అతడిని గాయపరిచారు. ఆ తర్వాత స్పెయిన్‌ వివాహితపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేశారు. బాధితురాలికి ప్రస్తుతం దుమ్కాలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న నిందితులను ప్రశ్నిస్తున్నట్లు దుమ్కా ఎస్పీ వెల్లడించారు. టూరిస్టు వీసా మీద స్పెయిన్‌ దంపతులు భారత్‌ వచ్చినట్టు తెలిపారు. స్పానిష్‌ జంట మోటార్‌ బైక్‌ పై దుమ్కాలో పర్యటిస్తూ పలు ప్రదేశాలు సందర్శిస్తున్నారన్నారు. దుమ్కా సమీపంలోని కుంజి గ్రామంలో టెంట్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దుండగులు బాధితురాలిపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని చెప్పారు.

మొత్తం ఆసియా ఖండంలో టూర్‌ కు ప్లాన్‌ చేసిన స్పానిష్‌ జంట తొలుత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ లలో తమ టూర్‌ పూర్తిచేసుకున్నారు. తర్వాత జార్ఖండ్‌ వచ్చారు. ఇక్కడి నుంచి నేపాల్‌ వెళ్లాలనేది వారి టూర్‌ ప్లాన్‌. ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకుంది.