ఒకే కేసు..విచారణ నుంచి తప్పుకొన్న ముగ్గురు జడ్జిలు..చరిత్రలో తొలిసారి!
కొన్నిసార్లు న్యాయస్థానాల్లో విచారణకు వచ్చే కేసుల నుంచి న్యాయమూర్తులు తప్పుకోవడం సహజం.
By: Tupaki Desk | 29 May 2025 6:54 AMకొన్నిసార్లు న్యాయస్థానాల్లో విచారణకు వచ్చే కేసుల నుంచి న్యాయమూర్తులు తప్పుకోవడం సహజం. గతంలో విచారణ చేపట్టి ఉన్నా.. ఏదైనా వ్యక్తిగత కారణంగా ఉన్నా ఈ విధంగా చేస్తుంటారు. అయితే, ఒకే కేసులో ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకొన్న అరుదైన సందర్భం తెలంగాణ హైకోర్టులో చోటుచేసుకుంది. ఇది చరిత్రలో తొలిసారిగా చెబుతున్నారు. అదికూడా సాదాసీదా కేసు విషయం కాకపోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు) ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ) అక్రమ తవ్వకాల కేసు ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే. దీంట్లో మే 6న ఓఎంసీ అధినేత, కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి సహా బీవీ శ్రీనివాసరెడ్డి, ఓఎంసీ కంపెనీ, గాలి పీఏ మెఫజ్అలీఖాన్, గనుల శాఖ మాజీ ఉన్నతాధికారి వీడీ రాజగోపాల్ కు సీబీఐ కోర్టు శిక్షలు విధించింది. దీనిని సవాల్ చేస్తూ వారు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. శిక్షలను సస్పెండ్ చేస్తూ.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. గాలి జనార్దన్ రెడ్డి శిక్షను రద్దు చేయాలని అప్పీల్ చేశారు.
ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్ కె.శరత్, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ నగేశ్ భీమపాక బుధవారం ఒకే రోజు విచారణ నుంచి వైదొలగారు.
సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై నిందితులు అప్పీల్ దాఖలు చేయగా తొలుత ఈ నెల 21న జస్టిస్ నందికొండ నర్సింగ్రావు విచారణ చేపట్టారు. బెయిల్ కోసం అప్పీల్ చేయగా.. సీబీఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణను వాయిదా వేశారు. దీంతో బుధవారం జస్టిస్ కె.శరత్ బెంచ్ ముందుకు పిటిషన్లు విచారణకు వచ్చాయి. కానీ, కోర్టు ప్రారంభ సమయంలోనే ఈ కేసులను మరో న్యాయమూర్తి ముందు ఉంచాలని ఆయన రిజిస్ట్రీని ఆదేశించారు. తర్వాత జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందుకు వెళ్లాయి. కానీ, రాత్రి 7 గంటల సమయంలో.. మరో న్యాయమూర్తి ముందు ఉంచాలంటూ ఆయన తప్పుకొన్నారు. దీంతో న్యాయవాదులు.. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇద్దరు జడ్జిలు తప్పుకొన్న వైనాన్ని వివరించారు. అయితే.. జస్టిస్ నగేశ్ భీమపాక.. పిటిషన్ల ఫైళ్లను తెప్పించి పరిశీలించి.. ఇది ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు అని.. తానూ వైదొలగుతున్నట్లు తెలిపారు.
గాలి బెయిల్ కోసం మరో వారం
ముగ్గురు జడ్జిలు తప్పుకొన్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి సహా ఓఎంసీ కేసు నిందితులు బెయిల్ పిటిషన్ల విచారణకు మరో వారం రోజులు ఆగాల్సిన పరిస్థితి ఎదురైంది.