కూనంనేనికి రిలీఫ్.. నామినేషన్ లో భార్య పేరు రాయకపోతే చెల్లదా?
కమ్యూనిస్టు నాయకుడు.. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
By: Tupaki Desk | 10 Jun 2025 6:30 AMకమ్యూనిస్టు నాయకుడు.. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఎన్నికల నామినేషన్ లో భార్య పేరు వెల్లడించని నేపథ్యంలో ఆయన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నామినేషన్ దాఖలు వేళ సమర్పించిన అఫిడవిట్ లో భార్య పేరు ప్రస్తావించనంత మాత్రాన కూనంనేని ఎన్నికల చెల్లకుండా పోదంటే హైకోర్టు స్పష్టం చేసింది.
‘‘ప్రతి దశలోనూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. స్వేచ్ఛగా.. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ అన్నది ప్రజాస్వామ్యంలో కీలకం. ఎన్నికల పిటిషన్ లో కీలక ఆధారాలుంటే తప్ప.. ప్రజలు ఇచ్చిన తీర్పు చెల్లదంటూ కొట్టివేయలేం’’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కూనంనేని తన నామినేషన్ లో భార్య పేరు వెల్లడించకున్నా.. భార్యకు చెందిన ఐదేళ్ల ఆదాయపన్ను రిటర్నులు.. ఆస్తులు.. అప్పుల వివరాల్ని వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు నేపథ్యంలో సీపీఐకు ఒక సీటును కేటాయించారు. ఇందులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేశారు ఆయనకు పోటీగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే.. కూనంనేని తన నామినేషన్ దాఖలులో భార్య పేరు వెల్లడించలేదని.. వాస్తవాల్ని తొక్కి పెట్టిన కారణంగా ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని.. శిక్ష, ఫైన్ విధించాలని కోరుతూ నందూలాల్ అనే ఓటరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. నామినేషన్ సందర్భంగా భార్య పేరు వెల్లడించకపోవటంపై పిటిషనర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. మరో అభ్యర్థి జలగం వెంట్రావు ఇదే అంశంపై అభ్యంతరం లేవనెత్తినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆమె పేరును వెల్లడించనప్పటికీ.. ఆమె పాన నంబరు.. ఐదేళ్ల ఆదాయపన్ను రిటర్నులు.. ఆస్తులు.. అప్పుల వివరాల్ని వెల్లడించారన్న విషయాన్ని గుర్తు చేశారు.
అఫిడవిట్ లో జీవిత భాగస్వామి కాలమ్ లో భార్య పేరును పేర్కొనకపోయినా.. మిగిలిన అన్నీ వివరాల్ని వెల్లడించారని.. నిబంధనల ప్రకారమే నామినేష్ ఉండటంతో రిటర్నింగ్ అధికారి దాన్ని ఆమోదించారే తప్పించి..ఎలాంటి పొరపాటు చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత ఉన్నప్పటికీ.. ఎన్నికల చెల్లదంటూ సరైన ఆధారాల్ని చూపటంలో పిటిషనర్ విఫలమయ్యారని పేర్కొంటూ.. పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ తీర్పును ఇచ్చింది.