'శవంతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు'.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
మనుషుల్లో మానవత్వం ఛాయలు రోజు రోజుకీ పోతూ, వారిలో మృగం లక్షణాలు ఇటీవల వెలుగులోకి వస్తోన్న ఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 July 2025 10:44 AM ISTమనుషుల్లో మానవత్వం ఛాయలు రోజు రోజుకీ పోతూ, వారిలో మృగం లక్షణాలు ఇటీవల వెలుగులోకి వస్తోన్న ఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఓ షాకింగ్ ఘటనలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... యజమాని భార్యను హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న వ్యక్తిని మృగంగా హైకోర్టు అభివర్ణించింది!
అవును... తాను పనిచేస్తున్న హాస్పటల్ యజమాని భార్యను హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసులో బెయిల్ మంజూరు చేస్తే అది సమాజంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
యజమాని భార్యపై లైంగిక వ్యామోహంతో నిందితుడు మృగంలా వ్యవహరించాడని.. అయితే, ఆమె ప్రతిఘటించడంతో విషయం బయట పడుతుందని దారుణంగా హత్య చేశాడని కోర్టు తెలిపింది. అనంతరం, మృతదేహంతో కామవాంఛ తీర్చుకున్నాడని.. దీనికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని.. వాస్తవాలను ట్రయల్ కోర్టు తేలుస్తుందని తెలిపింది.
అయితే... కేవలం చాలాకాలం నుంచి జైలులో ఉన్నాడు అనే కారణంతో ఇలాంటి కేసులో బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నేరానికి పాల్పడిన విధానం, నేర తీవ్రత, అది సమాజంపై చూపించే ప్రభావం, మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా... నెల్లూరు జిల్లా కావలిలో సుమారు 15 ఏళ్లుగా ఓ వైద్యుడు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అతనివద్ద కాంపౌండర్ గా పశ్చిమబెంగాల్ కు చెందిన నిందితుడు నయన్ బిస్వాస్ చేరాడు. అప్పటి నుంచీ యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న బిస్వాస్... 2024, డిసెంబరు 31 తెల్లవారుజామున యజమాని భార్యపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే... ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ సమయంలో.. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావలి పోలీసులు నయన్ బిస్వస్ పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి ప్రైమరీ చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలోనే కారాగారంలో ఉన్న నిందితుడు పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడికి బెయిల్ ఇస్తే సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.
