Begin typing your search above and press return to search.

28 ఏళ్లనాటి శిరోముండనం కేసు విచారణ పూర్తి... తీర్పు ఎప్పుండంటే...?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత సంచలనం సృష్టించిన ఒక కేసుకుకు సంబంధించిన కీలక పరిణామం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   4 April 2024 9:31 AM GMT
28 ఏళ్లనాటి శిరోముండనం  కేసు విచారణ పూర్తి... తీర్పు ఎప్పుండంటే...?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత సంచలనం సృష్టించిన ఒక కేసుకుకు సంబంధించిన కీలక పరిణామం తెరపైకి వచ్చింది. దీంతో ఈ కేసులో తీర్పు ఏ విధంగా రాబోతుందనే ఉత్కంఠ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉండటంతో ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది! ఈ తీర్పు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలున్నాయనే అంశంపైనా చర్చ జరుగుతోంది!!

అవును... రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం, వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న జరిగిన శిరోముండనం కేసులో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ కేసు విచారణ బుధవారం పూర్తయ్యిందని.. ఏప్రిల్ 12న తీర్పు వెలువరిస్తామని విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఈ తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని తెలుస్తుంది!

రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా.. మరో 8 మంది నిందితులు ఉన్నారు. ఈ కేసులోని ప్రధాన సాక్షి కోటి రాజు (58) ఇటీవల మృతిచెందగా.. ఆయన అనారోగ్యంతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు! ఇదే క్రమంలో... 15 మంది సాక్షుల్లో ఇద్దరు చనిపోయారు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతి చెందారు.

కాగా... శిరోముండనం కేసులో రాజు ప్రధాన సాక్షిగా ఉన్న కోటి రాజు (58) ఈ ఏడాది ఫిబ్రవరిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన అన్నయ్య కాగా.. గత ఏడాది మరో బాధితుడు పువ్వల వెంకటరమణ మృతిచెందారు. దీంతో బాధితులు ఐదుగురిలో ఇద్దరు మరణించారు. శిరోముండనం కేసు నమోదై 28 సంవత్సరాలు కావడంతో దళితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో... 12న వెలువడే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.