Begin typing your search above and press return to search.

టీఎంసీ-బీజేపీ.. మధ్యలో క్రికెటర్ ఎంపీ.. మొదట్నుంచీ కష్టాలే

అతడు చాయ్ తాగుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడం వివాదంగా మారింది. తాజాగా దేశం గళం వినిపించేందుకు అతడిని ఎంపిక చేయడం కూడా రచ్చకు దారితీసింది.

By:  Tupaki Desk   |   19 May 2025 2:30 PM
టీఎంసీ-బీజేపీ.. మధ్యలో క్రికెటర్ ఎంపీ.. మొదట్నుంచీ కష్టాలే
X

అతడు ఏడాది కిందట ఏ ముహూర్తాన ఎంపీ అయ్యాడో కానీ.. వరుసగా సంచలనాలే.. అసలు పశ్చిమాన ఉన్న గుజరాత్ కు చెందిన అతడు తూర్పున ఉన్న బెంగాల్ వెళ్లి ఎంపీగా గెలవడమే ఆశ్చర్యం.. అలా గెలిచాడో లేదో.. 2014 నాటి భూ ఆక్రమణ కేసులో నోటీసులు వచ్చాయి. ఆ తర్వాత నెల కిందట తన నియోజకవర్గం బెహ్రంపూర్ లో మత ఘర్షణలు జరుగుతుండగా.. అతడు చాయ్ తాగుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడం వివాదంగా మారింది. తాజాగా దేశం గళం వినిపించేందుకు అతడిని ఎంపిక చేయడం కూడా రచ్చకు దారితీసింది.

ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి వివిధ దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపీలను పంపుతున్న సంగతి తెలిసిందే. దౌత్య యుద్ధంలో భాగంగా ఇలా చేస్తోంది. మొత్తం 50 మంది నాయకులు ఏడు టీమ్ లుగా విదేశాల్లో పర్యటిస్తారు. వీరిలో చాలామంది ఎంపీలే. వేర్వేరు రాజకీయ పార్టీల వారు, మాజీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలతో కూడిన ఈ టీమ్ లలో కనీసం ఒక ముస్లిం ఎంపీ, లేదా అధికారి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ’ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్’ పేరిట వీరు వాణిని వినిపిస్తారు. పాకిస్థాన్ దుష్ట పన్నాగాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగడతారు.

విదేశాలకు పంపే ఎంపీల పేర్లు ఇవ్వాలని మొదట కోరిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా పార్టీలు ప్రతిపాదించకపోయినా కొందరి పేర్లతో టీమ్ లను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు చెందిన శశిథరూర్ ను ఇలానే చేర్చింది. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది.

తాజాగా తమను అడగకుండానే యూసుఫ్ పఠాన్ (బెహ్రంపూర్ ఎంపీ)ను విదేశాలకు వెళ్లే టీమ్ లోకి తీసుకోవడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. యూసుఫ్ విదేశీ పర్యటనకు వెళ్లడం లేదని అభిషేక్ ప్రకటించారు. మరోవైపు పార్టీ నిర్ణయం ప్రకారం విదేశాలకు వెళ్లే బృందం నుంచి యూసఫ్ పఠాన్ వైదొలగాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్ లు గెలిచిన టీమ్ ఇండియా సభ్యుడు యూసుఫ్ పఠాన్.

కాగా, ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైన్యం హాజరుకావడంపై భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఉగ్రవాదానికి పాక్ మద్దతును ఇది చాటుతోందని ఆరోపిస్తోంది. పాకిస్థాన్ వైఖరిని ప్రపంచానికి తెలియజేసేందుకు టీమ్ లను పంపుతోంది.