Begin typing your search above and press return to search.

సిద్ధాంతిని కలిసిన విజయమ్మ... బిడ్డలకోసం ఆరా?

దేశానికి రాజైనా అమ్మకు కొడుకే అంటారు.. బిడ్డలు ఎంత పెద్దోళ్లైనా తల్లి ఎప్పటికీ సంరక్షురాలే అని అంటారు

By:  Tupaki Desk   |   14 Oct 2023 8:33 AM GMT
సిద్ధాంతిని కలిసిన విజయమ్మ... బిడ్డలకోసం ఆరా?
X

దేశానికి రాజైనా అమ్మకు కొడుకే అంటారు.. బిడ్డలు ఎంత పెద్దోళ్లైనా తల్లి ఎప్పటికీ సంరక్షురాలే అని అంటారు. ఈ సమయంలో తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అనంతరం ఏపీలోనూ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో వైఎస్ విజయమ్మ ఒంగోలులోని ప్రముఖ సిద్ధాంతితో సమావేశమయ్యారని తెలుస్తుంది.

అవును... శుక్రవారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లిన వైఎస్ విజయమ్మ... ఒంగోలు చేరుకున్న అనంతరం ముందుగా టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఉన్న ఆయన తల్లిని పరామర్శించారు. ఆ తర్వాత సిద్ధాంతి అద్దేపల్లి హనుమంతరావును ఆయన నివాసంలో కలిశారు విజయమ్మ.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆమె కుమార్తె షర్మిల ఆధ్వర్యంలోని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అభ్యర్థులకు బీఫారం లు ఇచ్చేందుకు మంచి ముహూర్తం గురించి అడిగారని, ఇదే సమయంలో షర్మిల రాజకీయ భవిష్యత్తుపై సిద్ధాంతితో మాట్లాడారని కథనాలొస్తున్నాయి. ఇదే సమయంలో తన తృప్తి కోసం కుమారుడి రాజకీయం గురించి కూడా ప్రస్థావించారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి!

అయితే... ఇలా విజయమ్మ సిద్ధాంతి హనుమంతరావును కలవడం ఇదే తొలిసారి కాదని అంటున్నారు. గతంలో కూడా విజయలక్ష్మి ఒంగోలు వచ్చి ఆయా సందర్భంలో మంచిచెడులు చర్చించేవారని, సలహాలూ సూచనలూ వినేవారని అంటారు!

ఈ సందర్భంగా విజయమ్మ అక్కడకు వచ్చారని తెలుసుకున్న ఎదురుగా ఉన్న శ్రీహర్షిణీ డిగ్రీ కాలేజీ బాలికల క్యాంపస్‌ లో ఉన్న విద్యార్థినులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఈ సందర్భంగా... సిబ్బంది అదుపు చేస్తున్నా విద్యార్థినులు ససేమిరా అంటున్నా ఒక్కసారిగా వారందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. వారి ఉత్సాహాన్ని చూసిన విజయమ్మ విద్యార్థినులను దగ్గరకు తీసుకున్నారు.

ఈ సందర్భంగా విజయమ్మతో షేక్ హ్యాండ్స్ ఇస్తూ, జై జగన్ అని నినదిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు విద్యార్థినులు!

కాగా... శుక్రవారం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు రోడ్డు మార్గం ద్వారా కారులో బయల్దేరిన విజయమ్మ కాన్వాయ్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వాడపల్లి వద్దకు చేరుకునేసరికి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్ లోని వాహనం విజయమ్మ కారుని ఢీకొట్టింది. దీంతో ఆ కారు కొద్దిగా దెబ్బతింది.