Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో షర్మిల చేరికపై కేఏ పాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునే వారని కేఏ పాల్‌ తెలిపారు

By:  Tupaki Desk   |   5 Jan 2024 10:41 AM GMT
కాంగ్రెస్‌ లో షర్మిల చేరికపై కేఏ పాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!
X

తాజాగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ విలీనంపై స్పందిస్తూ ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు. ఆస్తులు, పదవి కోసం సోనియా గాంధీకి షర్మిల తన పార్టీ ని అమ్మేశారని తీవ్ర విమర్శలు చేశారు. షర్మిలా నీకు రాజకీయాలు అవసరమా? అంటూ మండిపడ్డారు. వైఎస్‌ రాజారెడ్డి, వైయస్‌ ఆత్మలతో తాను మాట్లాడుతానన్నారు.

రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి బతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునే వారని కేఏ పాల్‌ తెలిపారు. షర్మిల నిర్ణయంతో ఇప్పుడు వారి ఆత్మ ఘోషిస్తుందని అభిప్రాయపడ్డారు. జగన్‌ ను తిట్టడం.. రాష్ట్రాన్ని నాశనం చేయడమే షర్మిల పని అంటూ వ్యాఖ్యలు చేశారు. షర్మిలను ఏపీకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు.

ఇక వైఎస్‌ షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం చేసినప్పుడు షర్మిల డాన్స్‌ చేయాల్సి ఉండిందని ఎద్దేవా చేశారు. వైఎస్‌ చనిపోయినా ఆయన్ను సోనియా గాంధీ వదలడం లేదన్నారు. వైఎస్‌ పేరుని చార్జిషీట్‌లో కూడా సోనియా పెట్టించారని గుర్తు చేశారు. జగన్‌ను జైల్‌లో పెట్టారని.. వైఎస్‌ కుటుంబాన్ని సోనియా వేధించారని ఆరోపించారు. వైఎస్, తనకు మధ్య గొడవలకు కారణం కూడా సోనియా గాంధీయేనని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాద పూజ చేయించుకుంటుందని ధ్వజమెత్తారు.

దేశాన్ని సర్వ నాశనం చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని.. ఏపీని సోనియా చంపేసిందంటూ కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ అంటే ఇష్టం లేని వారు తమ పార్టీలో కానీ, టీడీపీ, జనసేనలో చేరాలని కోరారు. కాంగ్రెస్‌ లో ఎవరూ చేరొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే.. ముఖ్యమంత్రి చేస్తామని లేదా కేంద్రమంత్రిని చేస్తామని తనకు ఆఫర్‌ ఇచ్చారన్నారు.

విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ విశాఖలో ఆక్రమణలు చేసి.. నిర్మాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేయలేనిది లోకేష్‌ వచ్చి ఏమి చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ప్రజా శాంతి పార్టీని గెలిపించాలని కోరారు. అలాగే విశాఖ ఎంపీగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని తీవ్ర విమర్శలు చేశారు.

కాగా తనకు పుడ్‌ పాయిజన్‌ చేసి చంపాలని చూస్తున్నారు అంటూ కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై విశాఖ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు. తాను ఎవరికీ భయపడనని.. జడవనని తెలిపారు. ఈ సమయంలో వారి పేర్లు చెప్పాలని తాను అనుకోవడం లేదన్నారు.