Begin typing your search above and press return to search.

త్రీడీ గ్రాఫిక్స్ - మూడు ముక్కలాట... రాజధాని అంశంపై షర్మిళ సెటైర్లు!

ఏపీ పీసీసీ చీఫ్ గా ఏపీ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిళ... ఆల్ మోస్ట్ ప్రతీ అంశంపైనా రియాక్ట్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 7:38 AM GMT
త్రీడీ గ్రాఫిక్స్ - మూడు ముక్కలాట... రాజధాని అంశంపై షర్మిళ సెటైర్లు!
X

ఏపీ పీసీసీ చీఫ్ గా ఏపీ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిళ... ఆల్ మోస్ట్ ప్రతీ అంశంపైనా రియాక్ట్ అవుతున్నారు. తనపై ఎవరు విమర్శలు చేసినా.. దాదాపు ప్రతీ విమర్శకూ కౌంటర్ ఇస్తున్న ఆమె, అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లు, ఇస్తున్న స్టేట్ మెంట్ లపైనా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పొడిగింపు అంశం తెరపైకి రావడంతో ఆన్ లైన్ వేదికగా కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. పైగా... ఇటీవల హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా ప్రయత్నిస్తామంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అయ్యింది. దీనిపై ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన తీవ్రంగా స్పందించగా... తాజాగా వైఎస్ షర్మిల తనదైనశైలిలో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే... ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా? అంటూ గట్టిగా మొదలుపెట్టిన షర్మిళ... మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని ఆన్ లైన్ వేదికగా ప్రశ్నించారు. ఇదే క్రమంలో విభజన హామీలు అమలు కాలేదని, ఇప్పటివరకూ రాజధాని లేదని ఆమె ఫైరయ్యారు. ఈ సందర్భంగా అధికారపార్టీతో పాటు ప్రతిపక్షంపైనా కౌంటర్లు వేశారు.

ఈ క్రమంలో... ఆంధ్రుల రాజధాని ఎక్కడని అడిగితే.. 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి నెలకొందని చెప్పిన షర్మిళ... చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3డీ గ్రాఫిక్స్ అయితే, మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అని విమర్శించారు. ఇదే సమయంలో... పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వైసీపీకి రాజధానిపైనా.. రాష్ట్ర అభివృద్ధిపైనా చిత్తశుద్ది లేదని షర్మిళ విమర్శించారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకాలేదని... ఇందులో భాగంగా... రాష్ట్రానికి రాజధాని లేదు.. ప్రత్యేక హోదా రాలేదు.. ప్రత్యేక ప్యాకేజీలు లేవు.. పోలవరం పూర్తి కాలేదు.. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదంటూ నిప్పులు చెరిగారు.

ఇదే సమయంలో... రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు లేవు.. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదు.. అని స్పందించిన షర్మిళ... సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్ర ప్రదేశ్ ని అప్పులాంధ్ర ప్రదేశ్ చేశారని అన్నారు. మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.