Begin typing your search above and press return to search.

ఇండిపెండెంట్ గా అయినా రెడీ అంటున్నపిల్లి సుభాష్!

పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ తోనే ఉన్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి మంత్రి వేణుకి రామచంద్రాపురం నుంచి జగన్ టికెట్ ఇస్తే పార్టీపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

By:  Tupaki Desk   |   23 July 2023 12:54 PM GMT
ఇండిపెండెంట్ గా అయినా రెడీ అంటున్నపిల్లి సుభాష్!
X

పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ తోనే ఉన్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి మంత్రి వేణుకి రామచంద్రాపురం నుంచి జగన్ టికెట్ ఇస్తే పార్టీపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానని తేల్చి చెప్పారు.

అవును... గతకొన్ని రోజులుగా రోజు రోజుకీ ముదురుతున్న రామచంద్రపురం వైసీపీ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్‌ పై వైసీపీ సీనియర్‌ నేత, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆ నియోజకవర్గం నుంచి వేణుకి టికెట్ ఖాయమనే సంకేతాలు వెలువడటంతో పిల్లి సుభాష్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.

అయితే ఈ విషయం ముదురుతున్న దశలోనే పిల్లి సుభాష్ ని పిలిపించి మాట్లాడారు జగన్. అప్పట్లో ఎంపీని మిథున్ రెడ్డి సమక్షంలో జగన్ మందలించినట్టు కథనాలొచ్చాయి. ఆ భేటీ అయ్యిన నాలుగురోజుల్లోనే.. తాను పార్టీని కూడా ధిక్కరించే అవకాశముందని ఎంపీ పిల్లి సుభాష్ తేల్చి చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ పిల్లి సుభాష్... "కార్యకర్తలు, క్యాడర్‌ వద్ద వేణు ఎన్ని రోజులు నటిస్తారు? మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ తోనే ఉన్నాం. వేణుతో కలిపి నన్ను సమావేశపరుస్తానని సీఎం జగన్‌ చెప్పారు. క్యారెక్టర్‌ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పాను" అని పిల్లి సుభాష్‌ అన్న మాటలు పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయని తెలుస్తుంది.

ఈ సందర్భంగా తన కేడర్ ను నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పిన వేణు... కేడర్ ని గౌరవించుకోలేకపోతే ప్రతిష్ట కోల్పోయినట్లే అని అన్నారు. ఒకసారి ప్రతిష్ట కోల్పోతే పార్టీ నాయకుల ఇంటికి వెళ్తే వీది గుమ్మం తలుపు కాదు కదా.. పెరటి గుమ్మం తలుపు కూడా తెరవరని అన్నారు. "ఇక్కడ గౌరవం ఉన్నంత సేపే అన్నీ ఉంటాయి. నేను గౌరవం కోల్పోవడానికి సిద్ధంగా లేను" అని పిల్లి సుభాష్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తాను కానీ, తన అబ్బాయి కానీ రాబోయే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి పోటీ చేస్తామని ఎంపీ పిల్లి సుభాష్ పునరుధ్గాటించారు. మరి ఈ వ్యవహారంపై జగన్ కానీ, మిథున్ రెడ్డి కానీ ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి! ఇదే సమయంలో మంత్రి వేణు ప్రతిస్పందనపై కూడా ఆసక్తి నెలకొందని తెలుస్తుంది.