Begin typing your search above and press return to search.

అమలాపురం టికెట్ మీద సీఎం జగన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనా?

తాజా అమలాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాజకీయ ప్రత్యర్థులపై ఒక రేంజ్ లో విరుచుకుపడటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Aug 2023 5:11 AM GMT
అమలాపురం టికెట్ మీద సీఎం జగన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనా?
X

తాజా అమలాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాజకీయ ప్రత్యర్థులపై ఒక రేంజ్ లో విరుచుకుపడటం తెలిసిందే. ఓవైపు విపక్షాలపై విరుచుకుపడటం.. మరోవైపు సొంత పార్టీ లెక్కల్ని మరింత జాగ్రత్తగా సెల్ చేయటం చూస్తే.. ఏ విషయాన్ని ఆయన విడిచిపెట్టేది లేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. సాధారణంగా అధికారంలో ఉన్న వేళ.. మంత్రిగా ఉన్న నేతకు టికెట్ విషయంలో ఏ ముఖ్యమంత్రి /అధినాయకుడు క్లారిటీ ఇచ్చేందుకు త్రోటుపాటుకు గురవుతారు. కిందా మీదా పడుతూ తర్జనభర్జనలకు గురవుతుంటారు.

కానీ.. సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నం. తాను చేయాల్సిన పనిని సూటిగా చెప్పేస్తారు తప్పించి శషబిషలకు అవకాశం ఇవ్వరు. ఇదే విషయాన్ని అమలాపురంలో నిర్వహించిన సభలో తన మాటలతో చెప్పేశారు. డ్వాక్రా మహిళలకు సంబంధించిన కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘నువ్వు బాగా తిరుగు. లేదా నీ కొడుకు డాక్టర్ శ్రీకాంత్ ను బాగా తిప్పు’’ అని చెప్పేయటం ద్వారా తన మనసులో ఎవరు ఉన్నారు? అన్న విషయంపై స్పష్టత ఇచ్చారని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో యువ నాయకుల్ని రంగంలోకి దింపాలని.. పలువురు రాజకీయ వారసులకు టికెట్లు ఇవ్వటం ద్వారా పార్టీని మరో లెవల్ కు తీసుకెళ్లాలన్న యోచనలో ఉండటం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సందర్భానికి తగ్గట్లు తన మాటను చెబుతున్నారు.

మంత్రి బాధ్యతల్లో బిజీగా ఉండటంతో నియోజకవర్గంపై విశ్వరూప్ పెద్దగా ఫోకస్ చేయలేని పరిస్థితి. దీనికి తోడు వయోభారం కూడా ఎక్కువైన వేళ.. ఆయనకు బదులుగా ఆయన కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ కు అవకాశం ఇవ్వటం ద్వారా తర్వాతి తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఆలోచనతో జగన్ ఉన్న విషయం స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించిన టీంను సెట్ చేసుకునే విషయంలో క్లియర్ విజన్ తో అడుగులు వేస్తున్న జగన్.. అందుకు తగ్గట్లే వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా చెప్పాలి. తాజా ఎపిసోడ్ అందులో భాగంగా చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే అమలాపురం వైసీపీ అభ్యర్థి మంత్రి విశ్వరూపా లేదా ఆయన కుమారుడా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.