Begin typing your search above and press return to search.

వైనాట్ 175 వేళ.. మంత్రులు.. ఎమ్మెల్యే టికెట్లు చినిగిపోనున్నాయా?

సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఈసారి ఎన్నికల్లో కొందరికి టికెట్లు కేటాయించే విషయంలో తన నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

By:  Tupaki Desk   |   30 Sept 2023 5:21 AM
వైనాట్ 175 వేళ.. మంత్రులు.. ఎమ్మెల్యే టికెట్లు చినిగిపోనున్నాయా?
X

మంచి కానీ చెడు కానీ.. చేసే పని గురించి.. తాను తీసుకునే నిర్ణయం గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే తత్త్వం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కొట్టొచ్చినట్లుగా కనిపించదు. ఏమనుకుంటారో అన్న విషయాన్ని పట్టించుకోరు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తే అర్థం చేసుకుంటారన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. ప్రత్యర్థులు కావొచ్చు.. సొంత పార్టీ నేతలు కావొచ్చు.. తనకు అనుకూలంగా లేని పక్షంలో అలాంటి వారి విషయంలో తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంటారు. కొందరి విషయంలో మాటలతో కాకుండా చేతలతోనే చూపిస్తుంటారు. శషబిషలకు అవకాశం ఇవ్వని ఆయన తీరు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటుంది.

నాలుగైదు రోజుల క్రితం పార్టీ ప్రజాప్రతినిధులతో భేటీ సందర్భంగా సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఈసారి ఎన్నికల్లో కొందరికి టికెట్లు కేటాయించే విషయంలో తన నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. కొందరు మంత్రులు.. ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేయటం తెలిసిందే. వైనాట్ 175 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటూ కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదన్న ఆయన.. ప్రతి సీటు విషయంలోనూ మొహమాటాలకు తావు లేకుండా వ్యవహరిస్తున్న ధోరణి ఆసక్తికరంగా మారింది.

ఇందులో భాగంగా తన మంత్రివర్గంలోని కొందరు మంత్రులతో పాటు ఇద్దరు సీనియర్ మంత్రులను సైతం ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దించనున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని తేల్చేస్తున్నారు. అదే సమయంలో ఇద్దరు.. ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్ల ఇవ్వటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఒక సీనియర్ మంత్రి తనకు రాజ్యసభ ఛాన్సు ఇవ్వాలని కోరుతూ.. తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారు.

దీనిపై ఆయన స్పందిస్తూ.. అలా చేయటం ప్రస్తుతానికి కుదరదని తేల్చేసిన సీఎం.. ప్రస్తుతానికి మీరే పోటీ చేయమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ‘‘2026లో మిమ్మల్ని రాజ్యసభకు పంపుతా. అప్పుడు ఖాళీ అయ్యే మీ ఎమ్మెల్యే స్థానంలో మీ అబ్బాయిని పోటీ చేయిద్దాం’’ అని ఆ మంత్రికి స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. సదరు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తునన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ జిల్లాకు చెందిన ఎంపీ ఒకరు ప్రయత్నిస్తుంటే.. ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి సంకేతం రాలేదని చెప్పటం గమనార్హం.

మరోవైపు ఏలూరు ఎంపీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరని.. ఆయన బరిలో లేకుంటే.. ఆయన స్థానంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నేతకు కేటాయిస్తున్నారని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలోనూ ఒక సీనియర్ ఎమ్మెల్యేను ఈసారి లోక్ సభ బరిలోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం విషయానికి వస్తే.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని పలుమార్లు కోరినప్పటికి.. ఆయన నుంచి సానుకూల సంకేతం రాలేదని చెబుతున్నారు.

అదే సమయంలో మరో జిల్లాలో మంత్రిగా ఉన్న నేతను ఎంపీగా.. ఇప్పుడు ఎంపీగా ఉన్న నేతను ఎమ్మెల్యేగా బరిలోకి దింపే వీలుందంటున్నారు. కేబినెల్ లోని పలువురు మంత్రులు.. కొందరు ఎంపిక చేసిన ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దింపేలా జగన్ యోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మంత్రుల్లో దాదాపు నలుగురు వరకు ఎంపీలుగా పోటీ చేసే వీలున్నట్లు చెబుతున్నారు.

అదే సమయంలో ఇప్పుడు ఎంపీలుగా ఉన్న కొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇవ్వనున్నారు. రాజమహేంద్రవరం సమన్వయకర్తగా ఉన్న శ్రీనివాస్ కు బదులుగా ఎంపీ మార్గాని భరత్ ను బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు.. తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు.. అనంతపురం, ప్రకాశం.. కర్నూలు.. చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఈసారి టికెట్లు ఇచ్చే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.