క్యాడర్ కి పండుగ వద్దా జగన్ ?
అవును మేము ఫలానా పార్టీలో ఉన్నాం, మా నాయకుడు ఆయన మా ఫిలాసఫీ ఇది. మేము అధికారంలోకి వస్తామని ఎన్నో చేస్తామని గొప్పగా చెప్పుకుంటారు.
By: Tupaki Desk | 15 May 2025 1:30 AMవైసీపీ అధినేత అంటే ఒక స్పెషల్. ఆయన తన పార్టీకి ఒక ప్రత్యేక శైలిలో నడుపుతారు. దేశంలో బీజేపీకి తేడా పార్టీ అంటారు. ఆ పార్టీ నేతలు కూడా అదే చెప్పుకుంటారు. అందరు నడిచే తోవలో మేము నడవమని గొప్పగా చెబుతారు. మా ఫిలాసఫీ మా పార్టీ రంగు రుచి వాసన అన్నీ వేరు అని కూడా అంటారు.
అయితే తెలుగు నాట కానీ ఇంకా చెప్పాలంటే దేశంలోనే అరుదైన పార్టీగా వైసీపీని చూడాలని అంటారు ప్రతీ పార్టీకి ఒక అవిర్భావ దినోత్సవం ఉంటుంది. ప్రతీ ఏటా దానిని ఘనంగా నిర్వహిస్తారు. ఫార్మేషన్ డే అని క్యాడర్ అంతా మురిసిపోతారు. పార్టీలో పెద్దా చిన్నా అంతా కలసి ఒక చోటకు చేరి ఆ రోజు పార్టీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుంటారు.
ఏడాదిలో చేసిన పనిని మననం చేసుకుంటారు, కొత్త ఏడాదిలో ఏమి చేయాలో ఒక రకమైన రోడ్ మ్యాప్ ని రెడీ చేసుకుంటారు. అంతే కాదు దాని ప్రకారమే ముందుకు సాగుతారు. ఇక పార్టీలు ఏటా వార్షికోత్సవాలు ఎందుకు అంటే కేవలం కార్యకర్తల కోసమే అని జవాబు వస్తుంది.
అవును మేము ఫలానా పార్టీలో ఉన్నాం, మా నాయకుడు ఆయన మా ఫిలాసఫీ ఇది. మేము అధికారంలోకి వస్తామని ఎన్నో చేస్తామని గొప్పగా చెప్పుకుంటారు. అంటే ఇది పూర్తిగా కార్యకర్తల పండుగ అన్న మాట. నిజానికి కార్యకర్తలకు పార్టీకి మధ్య వారధిగా ఇలాంటి వ్వవస్థాపక దినోత్సవాలు ఉంటాయి.
పార్టీలో అన్ని జిల్లాల నుంచి వచ్చే నేతలు రాష్ట్ర నేతలు తమ జిల్లా నేతలు ఇలా అందరినీ ఒకేసారి ఒకే చోట కలుసుకునే అవకాశం కూడా ఈ విధంగా దక్కుతుంది. నాయకుల అధినాయకుల ప్రసంగాలలో పునరుత్తేజం పొందిన కార్యకర్తలు మరింత ఉత్సహాం తెచ్చుకుని పార్టీ జెండా కోసం మరోసారి తన జీవితాన్ని అంకితం చేసేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి.
అయితే తెలుగు నాట చూస్తే ఈ ఏడాది వరసగా జనసేన పార్టీ, బీఆర్ఎస్ వార్షికోత్సవాలు జరిగాయి. తెలుగుదేశం ప్రతీ ఏటా క్రమం తప్పకుండా మహానాడుని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. వామపక్షాలు వాటి పద్ధతిలో అవి చేస్తాయ్. బీజేపీ కూడా చేసింది. కాంగ్రెస్ సైతం తన పంధాలో వార్షికోత్సవాలు నిర్వహిస్తోంది.
కానీ వైసీపీ మాత్రం తన ప్లీనరీని నిర్వహించడం లేదు. నిజానికి వైసీపీ పుట్టి పదిహేనేళ్ళు అయింది. ఈ మధ్యలో గట్టిగా రెండు లేక మూడు ప్లీనరీలను నిర్వహించి ఉంటుందేమో అని అంటున్నారు. అంతకు మించి చేయడం లేదు. నిజానికి వైసీపీ ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీ. ఆర్ధికంగా ఘనమైన పార్టీ.
ఆ పార్టీ ఒకసారి అధికారంలో సైతం ఉంది. అటువంటి పార్టీ ప్రతీ ఏటా ప్లీనరీని విజయవంతంగా నిర్వహించుకునే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయనే అంతా అంటారు. కానీ ఎందుకో అధినాయకత్వం మాత్రం ఆ ఊసే తలవడం లేదు అని అంటున్నారు.
దాంతో వైసీపీ క్యాడర్ ఇతర పార్టీలు నిర్వహించుకునే వార్షికోత్సవాలను చూస్తూ మాకు ఈ భాగ్యం ఎందుకు లేదో అని మధన పడుతున్నారు. ఇటీవలే వైసీపీ అధినేత జగన్ పార్టీ సమావేశంలో వచ్చే ఏడాది ప్లీనరీని గొప్పగా నిర్వహిద్దామని చెప్పారు. అంటే వైఎసార్ జయంతి వేళ జూలై 7, 8 తేదీలలో అన్న మాట. ఇప్పటికి చూస్తే గట్టిగా పద్నాలుగు నెలల దాకా సమయం ఉంది.
దాని కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు కళ్ళు ఒత్తులు వేసుకుని చూడాలన్న మాట. నిజానికి వైసీపీ ప్రతీ ఏటా ఒక్కో జిల్లాలో ప్లీనరీని నిర్వహిచడం ద్వారా బలమైన పునాదులు వేసుకోవచ్చు. అంతే కాదు క్యాడర్ తో నేరుగా అనుసంధానం కావచ్చు. పార్టీలో కొత్త జోష్ నింపవచ్చు. అధికారంలో ఉన్నపుడు తొలి రెండేళ్ళూ కరోనాతో పోయింది. చివరి రెండేళ్ళూ ఎన్నికల హడావుడి అనుకున్నా ఇపుడు విపక్షంలో ఉన్నారు కదా ఇదే తగిన సమయం ప్రతీ ఏటా ప్లీనరీ నిర్వహించుకునేందుకు అని అంటున్నారు.
మరి 2026లో ప్లీనరీ అని వైసీపీ అధినాయకత్వం చెబుతోంది. అంటే నాలుగేళ్ళకో అయిదేళ్ళకో ఒకసారి మాత్రమే నిర్వహిస్తారా అన్నదే క్యాడర్ సందేహం. సరే వచ్చే ఏడాది ప్లీనరీ కోసం ఇప్పటి నుంచే క్యాడర్ కౌంట్ డౌన్ అంటూ కాలం వెళ్ళదీస్తున్నారు.