Begin typing your search above and press return to search.

పార్టీ కోసం జగన్ ఆ పని చేయాల్సిందేనా ?

తెలుగు రాష్ట్రాలే కాదు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా తన పార్టీ క్యాడర్ కోసం భారీ సభలను నిర్వహిస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   28 April 2025 4:15 AM
పార్టీ కోసం జగన్ ఆ పని చేయాల్సిందేనా ?
X

తెలుగు రాష్ట్రాలే కాదు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా తన పార్టీ క్యాడర్ కోసం భారీ సభలను నిర్వహిస్తూ ఉంటుంది. దానికి సరైన వేదికగా ఆవిర్భావం రోజుని ఎంచుకుంటుంది. ఏపీలో చూస్తే జనసేన మార్చి 14న భారీ ఎత్తున ఆవిర్భావ సభను నిర్వహించి సత్తా చాటింది ఒక విధంగా అది జనసేన క్యాడర్ కి ఎంతో ఉత్సాహాన్ని ఊతాన్ని ఇచ్చింది.

ఇక ఏప్రిల్ 27న తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా తన పార్టీ రజతోత్సవ సభను భారీ జన సందోహం మధ్యన నిర్వహించించి గులాబీ దండులో కొత్త ఆనందాన్ని నింపింది. ఎపుడు ఎన్నికలు జరిగినా వచ్చేది మేమే అన్న నిబ్బరాన్ని వారిలో కలిగించింది. గత ఏణ్ణర్ధంగా ఫాం హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ ఈ భారీ సభకు వచ్చి బిగ్ సౌండ్ చేశారు. దాంతో గులాబీ పార్టీ సంతోషం అంతా కడలి తరంగాలను తలపించింది.

ఇక మే నెలలో చూస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీ మహానాడు సభను అత్యంత ఘనంగా నిర్వహించబోతోంది. ఈ ఏడాది టీడీపీకి 43వ పార్టీ పండుగ. పైగా కడపలో నిర్వహించాలని చూస్తున్నారు. అక్కడ ఉన్న పులివెందులలో మహానాడు మూడు రోజుల వేడుకను అత్యంత ఘనంగా నిర్వంచాలని తలపోస్తున్నారు. దాంతో టీడీపీ శ్రేణులలో సరికొత్త జోష్ ని మహానాడు నింపడం ఖాయం.

ఇలా తెలుగు నాట కీలక పార్టీలు అన్నీ తమ పార్టీ పండుగలను ప్రతీ ఏటా కచ్చితంగా నిర్వహించుకుంటూ క్యాడర్ లో రెట్టింపు పోరాట స్పూర్తిని నింపుతున్నాయి. మరి ఇలాంటి పార్టీ పండుగలకు వైసీపీ దూరంగా ఉంటోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది.

వైసీపీ 2022లో అధికారంలోకి వచ్చిన తరువాత ఒకే ఒకసారి పార్టీ మీటింగ్ ని గుంటూరు వేదికగా జరిపింది. ఆనాటి సభలో జగన్ ని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగిందని ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలతో దానిని విరమించుకున్నారని వార్తలు వచ్చాయి.

దాని కంటే ముందు 2017లో ప్రతిపక్షంలో వైసీపీ ఉండగా ఒక భారీ పార్టీ సభను నిర్వహించారు. వైసీపీ పార్టీ సభలను ప్లీనరీ గా పేర్కొంటూ నిర్వహిస్తారు. ఇలా చూస్తే కనుక మొత్తం వైసీపీ చరిత్రలో అత్యంత ఘనంగా పార్టీ జన సందోహం మధ్యన నిర్వహించిన సభలు ఈ రెండే కావడం విశేషం.

మళ్ళీ ఆ స్థాయిలో ఎపుడూ సభలు నిర్వహించలేదు. నిజానికి ప్రతీ రెండేళ్ళకో లేక మూడేళ్ళలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించి బూత్ లెవెల్ నుంచి పార్టీలో కార్యవర్గాలు ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యవర్గాలు నియామకం తరువాత పార్టీ సభలను నిర్వహించుకుంటే క్యాడర్ సజీవంగా ఉంటుంది. కొత్త నేతలు కొత్త నెత్తురు వచ్చి పార్టీ మరింతగా బలపడుతుంది.

అయితే వైసీపీ ఎందుకో సంస్థాగతంగా ఈ తరహా ఆలోచనలు చేసేందుకు పెద్దగా ఆసక్తిని చూపించడంలేదని అంటున్నారు. ఈ రోజుకీ పార్టీలో నామినేటెడ్ పదవులే ఉంటున్నాయి. అధినాయకత్వం పార్టీ నేతలకు పదవులు ఇస్తూ పనిచేయమని కోరుతుంది. అంటే పై నుంచి ఆదేశాలతోనే పార్టీ కార్యకలాపాలు అన్న మాట. దాంతో లీడర్ కి క్యాడర్ కి మధ్య అందమైన లింక్ అన్నది లేకుండా పోతోంది అని అంటున్నారు.

ఇక ప్రతీ ఏటా పార్టీ సభలు నిర్వహించి పార్టీ క్యాడర్ ని ఉత్తేజం చేస్తే అది ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. అంతే కాదు తమ బలం ఏమిటో తాము స్వయంగా అంచనా వేసుకోవచ్చు. అదే సమయంలో ప్రత్యర్ధులకు కూడా దానిని చూపించవచ్చు. అలా పార్టీ నేతలలో క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపవచ్చు అని అంటున్నారు. మరి వైసీపీ ఈ దిశగా ఆలోచనలు చేస్తేనే వైసీపీ మిగిలిన పార్టీలతో ధీటుగా పోటీ పడగలుగుతుందని అంటున్నారు.