'దీపక్ తాట తీయరా?'... పవన్ కు వైసీపీ మహిళా నేతల ప్రశ్నలు!
రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో ఆత్మహత్యకు పాల్పడి, అక్కడే చికిత్స తీసుకుంటున్న బాధితురాలి కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించారు.
By: Tupaki Desk | 1 April 2025 10:43 AMరాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో ఆత్మహత్యకు పాల్పడి, అక్కడే చికిత్స తీసుకుంటున్న బాధితురాలి కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్ లు పరామర్శించారు! ఈ సందర్భంగా కీలక డిమాండ్ ను తెరపైకి తెస్తూ.. ప్రభుత్వం పైనా, డిప్యూటీ సీఎం పవన్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో ఆత్మహత్యకు పాల్పడి, అక్కడే చికిత్స తీసుకుంటున్న బాధితురాలి కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్సీ వరుదు కల్యాణి... ఆస్పత్రి బెడ్ పై అచేతనంగా పడి ఉన్న బాధితురాలిని చూస్తే కడుపు తరుక్కుపోతుందని.. ఆ తల్లితండ్రులకు 12 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డ ఆమె అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె సూసైడ్ నోట్ చదవడం జరిగిందని తెలిపారు. ఈ సమయంలో.. కిమ్స్ ఆస్పత్రిలో ఏజీఎం గా పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి ఆమెను మోసం చేసి, బ్లాక్ మెయిల్ చేయడం జరిగిందని.. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. ఈ విషయాలను బాధిత యువతి సూసైడ్ నోట్ లో ప్రస్థావించడం జరిగిందని తెలిపారు.
ఇంతటి ఘోరం జరిగితే విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే, మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించి మాట్లాడితే.. అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చి కేసు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలోని సీసీ టీవీ ఫుటేజ్ ని తల్లితండ్రులకు ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు.
సీఎం ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు.. హోంమంత్రిగా ఓ మహిళ ఉన్నప్పటికీ.. ఘటన జరిగి 10 రోజులు అవుతున్నా వారి నుంచి స్పందన రావడం లేదని.. పోలవరం వరకూ వచ్చిన సీఎం చంద్రబాబు, అక్కడికి సమీపంలోనే ఉన్న బాధిత కుటుంబాని పరామర్శించడానికి రాలేదని విమర్శించారు.
ఇక డిప్యూటీ సీఎం నియోజకవర్గం పక్కనే ఉందని.. మహిళలను ఎవరైనా వేదిస్తే తాట తీస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నారని వరుదు కల్యాణి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాధిత మహిళను ఎంతో దారుణంగా వేధించిన దీపక్ అనే వ్యక్తి తాట పవన్ కల్యాణ్ తీయరా అని అడిగారు.
ఇదే హాస్పటల్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడితే.. అదే ఆస్పత్రిలో ఆమెకు ట్రీట్ మెంట్ జరుగుతుంటే ఆమెకు ఏమి న్యాయం జరుగుతుందని వైసీపీ మహిళా నేత ప్రశ్నించారు. ఈ ఘటనపై సిట్ వేసి దర్యాప్తు జరపాలని.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని తెలిపారు.
ఇదే సమయంలో... బాధిత కుటుంబం తల్లడిల్లిపోతున్న సమయంలో, సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. మహిళలను న్యాయం జరిగితే ఊరుకోమన్న పవన్ ఇప్పుడు ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలని.. ఈ ఘటనపై పూర్తీస్థాయిలో దర్యాప్తు జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదే క్రమంలో... బాధితురాలిని దారుణంగా హింసించిన దీపక్ ను శిక్షించాలని.. అధికార టీడీపీకి అతడు సన్నిహితుడు కావడంతోనే ప్రభుత్వం ఏ రకమైన చర్యలూ తీసుకోవడం లేదని రాజమండ్రి మాజీ ఎంపీ భారత్ మండిపడ్డారు. బాధిత యువతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని.. ఆమెకు ఇంజక్షన్ ఎవరు చేశారో ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.