Begin typing your search above and press return to search.

వైసీపీలో చీలిక‌.. రెండు వ‌ర్గాల పోరు..!

వైసీపీలో ఆది నుంచి ఉన్న నాయ‌కులు.. జ‌గ‌న్ అంటే ప‌డి చ‌స్తారు. వీరు జ‌గ‌న్‌కు వీరాభిమానులు.

By:  Tupaki Desk   |   30 April 2025 6:45 PM
వైసీపీలో చీలిక‌.. రెండు వ‌ర్గాల పోరు..!
X

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. వైసీపీ లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగాయా? వ‌ర్గాలుగా పార్టీ ఇప్ప‌టికే చీలిపోయిందా? ఒక‌రిపై ఒక రు దుమ్మెత్తి పోసుకుంటున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. వైసీపీ అధికారం పోయిన ద‌రిమిలా.. పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల క‌న్నా.. ర‌చ్చ‌లే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అనంత‌పురానికి చెందిన కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి నుంచి ఉత్త‌రాంధ్ర‌లోని ఒక‌రిద్ద‌రు నాయకుల వ‌ర‌కు కూడా.. వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే.. ఇలా జ‌రిగింద‌ని అంటున్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఇది నిన్న మొన్న‌టి మాట‌. కానీ, ఇప్పుడు వైసీపీలోనే క‌లిసి ఉన్న‌వారిలోనూ..జ‌గ‌న్ అంటే ప్రేమించే వారిలోనూ రెండు వ‌ర్గాలుగా చీలిపోయి.. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న్నుకుంటున్నార‌న్న‌ది ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం. ప్ర‌స్తుతం వైసీపీలో కొంద‌రు నాయ‌కులపై కేసులు న‌మోద‌వుతున్న విష‌యం తెలిసిందే. దీనిలో ఓ వ‌ర్గం పాత్ర ఉంద‌ని.. ఆ వ‌ర్గం నాయ‌కులు సంబంధిత నేత‌ల‌కు సంబంధించిన కేసుల స‌మాచారాన్ని.. లోపాయికారీగా.. బ‌హిర్గ‌తం చేస్తున్నార‌న్న‌ది చ‌ర్చ‌. అయితే.. ఈ రెండు విష‌యాల‌ను కూడా జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఏంటా వ‌ర్గాలు?

వైసీపీలో ఆది నుంచి ఉన్న నాయ‌కులు.. జ‌గ‌న్ అంటే ప‌డి చ‌స్తారు. వీరు జ‌గ‌న్‌కు వీరాభిమానులు. ఆయ‌న ఎంత చెబితే అంత‌. కూర్చోమంటే కూర్చుంటారు, నిల‌బ‌డ‌మంటే నిల‌బ‌డ‌తారు. వీరంతా ఇప్పుడు జ‌గ‌న్ జ‌ట్టుగా మారిపోయారు. ఇక‌, మ‌ధ్య‌లో పార్టీలోకి వ‌చ్చి.. పెత్త‌నం అంతా త‌న హ‌స్త‌గ‌తం చేసుకుని, వైసీపీ హ‌యాంలో స‌క‌ల శాఖల మంత్రిగా పేరు తెచ్చుకున్న అప్ప‌టి స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ని అభిమానించేవారు.. ఆయ‌న పేరు చెప్పుకొని ప‌దవులు, ఎమ్మెల్యే సీట్లు పొందిన వారు మ‌రో వ‌ర్గంగా త‌యార‌య్యారు. వీరికి భిన్నంగా త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కులు ఉన్నా..వారు గ్రూపులు క‌ట్ట‌లేదు.

క‌ట్ చేస్తే.. స‌జ్జ‌ల వ‌ర్గాన్ని వ్య‌తిరేకించే జ‌గ‌న్ గ్రూపు.. ఇప్పుడు దూకుడుగా ఉంది. స‌జ్జ‌ల అన్నీ తానై.. కొంద‌రికి మంత్రి ప‌దువు లు ఇప్పించారు. మ‌రికొంద‌రికి.. ఎమ్మెల్యే సీట్లు కూడా ఇప్పించారు. ఈ క్ర‌మంలో త్యాగాలు చేసింది.. జ‌గ‌న్ వ‌ర్గంగా ఉన్న‌వారే. దీంతో ఇప్పుడైనా త‌మ‌కు వాల్యూ ఉంటుంద‌ని వారు ఆశించినా.. ఎక్క‌డా స‌జ్జ‌ల వ‌ర్గం వారికి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. దీంతో ఇప్పుడు అరెస్టు అవుతున్న‌.. లేదా.. కేసులు వెంటాడుతున్న నేత‌ల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం.. జ‌గ‌న్ వ‌ర్గంగా ఉన్న వారిలో ఒక‌రిద్ద‌రు బ‌హిర్గ‌తం చేస్తున్నారు. ఈ ప‌రిణామాలే.. ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌కు దారి తీశాయి. మ‌రి ఇది ఎందాకా వెళ్తుందో చూడాలి.