అవిశ్వాసం వైసీపీ పెడితే రిజల్ట్ అది !
ఎవరైనా ఎవరి మీద అయినా అవిశ్వాసం పెట్టవచ్చు. అది చట్టం ఇచ్చిన హక్కు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చేశాక అంతా అయిపోయింది అనుకోవడం తప్పు.
By: Tupaki Desk | 24 April 2025 2:46 PMఎవరైనా ఎవరి మీద అయినా అవిశ్వాసం పెట్టవచ్చు. అది చట్టం ఇచ్చిన హక్కు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చేశాక అంతా అయిపోయింది అనుకోవడం తప్పు. ఇల్లు అలకగానే పండుగ కానే కాదు. బలం ఉండాలి, నెగ్గించుకుని రావాలి. దానికి వ్యూహాలు ఉండాలి. తమ వారు జారిపోకుండా చూసుకోవాలి.
అయితే విశాఖ జిల్లాలో రెండు అవిశ్వాసాల విషయంలో ఫలితాలు రెండు విధంగా వచ్చాయి. ఈ రెండింటిలోనూ ఓటమి పాలు అయి పీఠాలు పోగొట్టుకున్నది మాత్రం వైసీపీయే. మహా విశాఖ నగర పాలన సంస్థ జీవీఎంసీ మేయర్ పీఠానికి గత వారంలో అవిశ్వాసం పెట్టారు. ఈ మేయర్ మాకు వద్దు అంటూ కూటమి నోటీసులు ఇచ్చింది.
దాని మీద ప్రత్యేక సమావేశం పెట్టి చర్చ జరిపించారు. అయితే జీవీఎంసీలో బలం ఉన్నా వైసీపీకి అవిశ్వాసంలో విశ్వాసం దక్కలేదు. పైగా బాయ్ కట్ చేసింది. దాంతో మ్యాజిక్ ఫిగర్ కి తగిన నంబర్ ని దక్కించుకుని కూటమి అవిశ్వాసం గెలిచింది. దాంతో వైసీపీ మేయర్ మాజీ కావాల్సి వచ్చింది.
ఆ సంగతి అలా ఉంచితే అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మునిసిపాలిటీలో తమ పార్టీ తరఫున గెలిచి చైర్ పర్సన్ అయిన ఆమె బీజేపీలోకి వెళ్ళారని, అలాగే చాలా మంది కౌన్సిలర్లు కూటమి వైపు వెళ్ళారని ఆగ్రహించిన వైసీపీ తమ పార్టీ నుంచే చైర్ పర్సన్ ఉండాలని భావించింది.
దాంతో చైర్ పర్సన్ మీద అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది. అయితే దీని మీద జరిగిన చర్చలో వైసీపీ అవిశ్వాసం ఓడిపోయింది. చైర్ పర్సన్ పట్ల విశ్వాసం ప్రకటిస్తూ మెజారిటీ కౌన్సిలర్లు చేతులెత్తారు. దాంతో బీజేపీలోకి వెళ్ళినా చైర్ పర్సన్ కి పీఠం నిలబడింది.
ఇక్కడ రాజకీయ చోద్యం ఏమిటంటే 2021లో ఎలమంచిలి మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగినపుడు బీజేపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవలేదు. ఇపుడు ఏకంగా చైర్ పర్సన్ పీఠమే వరించి వచ్చింది. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు బీజేపీలోకి చేరిపోవడం వల్లనే ఇలా జరిగింది అని అంటున్నారు.
ఇక వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినపుడు ఆ పార్టీలో ఉన్న వారు కూడా ఓటింగ్ సమయానికి కూటమిలోకి ఫిరాయించడంతో కూటమి గెలిచింది అని అంటున్నారు. అలా వైసీపీ వేసుకున్న లెక్కలు అంచనాలూ అన్నీ మారిపోయాయని చెబుతున్నారు.
ఇంకో వైపు చూస్తే కనుక వైసీపీకి చెందిన జీవీఎంసీ మేయర్, అలాగే ఎలమంచిలి మున్సిపాలిటీ రెండూ ఒకేసారి పోవడం విశేషం అంటున్నారు. అంతే కాదు కూటమి అవిశ్వాసం పెడితే నెగ్గింది. అదే వైసీపీ పెడితే ఓడింది. అలా రెండు చోట్లా కూటమి లబ్ది పొందితే వైసీపీ సీట్లు జార్చుకుని రాజకీయంగా నష్టపోయింది అని అంటున్నారు దీనికి కారణం వైసీపీ తరఫున నెగ్గిన వారు అంతా కూటమికి సపోర్ట్ చేయడమే అని అంటున్నారు.