Begin typing your search above and press return to search.

వివేకా హత్య... వదిన భారతిపై షర్మిళ సంచలన వ్యాఖ్యలు!

ఇదే సమయంలో... అవినాష్ ని చిన్నపిల్లాడు అని జగన్ అంటున్నారని గుర్తుచేసిన షర్మిళ... వీళ్లు చిన్నపిల్లలు కాదని అన్నారు

By:  Tupaki Desk   |   8 May 2024 4:07 AM GMT
వివేకా హత్య... వదిన భారతిపై షర్మిళ సంచలన వ్యాఖ్యలు!
X

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార కార్యక్రమాలు వేడెక్కిపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానంగా వివేకా హత్య కేసు ప్రస్థావిస్తూ వైఎస్ షర్మిళ చేస్తున్న విమర్శలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకా హత్య కేసు ప్రస్థావన వద్దని కోర్టు చెప్పినా షర్మిళ తగ్గడం లేదు! మైకందుకున్న ప్రతీ సారీ అవినాష్ రెడ్డి లక్ష్యంగా వివేకా హత్యకేసు ప్రస్థావన తెస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా భారతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిళ!

అవును... వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వివేకా హత్య కేసు ప్రస్తావనను మరోసారి తీసుకువచ్చారు. ఈ క్రమంలో... వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి రూ.40 కోట్లు చేతులు మారాయంటూ ఆమె ఆరోపించారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు.

ఇదే సమయంలో... అవినాష్ ని చిన్నపిల్లాడు అని జగన్ అంటున్నారని గుర్తుచేసిన షర్మిళ... వీళ్లు చిన్నపిల్లలు కాదని అన్నారు. హత్య జరిగిన రోజున ఎవరు చంపారనేది తమకు కూడా తెలియదని, అయితే.. సీబీఐ వచ్చి, ఎంక్వైరీ చేసి.. అవినాష్ రెడ్డి హస్తం ఉందని సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ చూపిస్తుందని అన్నారు. ఇదే సమయంలో... చంపినవాళ్లూ, చంపించిన వాళ్లూ కూడా హత్యకు ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారని తెలిపారు షర్మిళ!

ఇదే క్రమంలో... గొడ్డలితో ఏడు సార్లు నరికితే వివేకానందరెడ్డి ఎముకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వచ్చిందంట, ఇల్లంతా రక్తం అయిపోయిందంట, అయినప్పటికీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. అది ఎవరమ్మా... జగన్ మోహన్ రెడ్డి భార్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిళ! ఇదే సమయంలో... నాడు అలా ప్రసారం చేయడానికి గల కారణాలు ఇప్పటికీ చెప్పలేదు అని షర్మిళ అన్నారు.