బాబు గుట్టు అంతా ఆ బుక్ లోనే...జగన్ హాట్ కామెంట్స్ !
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన మీద వైసీపీ తన పోరాటం జోరుని పెంచనుంది.
By: Satya P | 27 May 2026 1:03 PM ISTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన మీద వైసీపీ తన పోరాటం జోరుని పెంచనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అయిన సందర్భంగా జూన్ 4 నుంచి 12 వరకూ వారం రోజుల పాటు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ పిలుపు ఇచ్చారు వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడుతూ బాబు పాలన మీద ఘాటైన కామెంట్స్ చేశారు. ఏపీలో వెన్నుపోటు పాలన సాగుతోంది అని విమర్శించారు.
హామీలతో మోసం :
ఏపీలో టీడీపీ కూటమి పాలన అంతా హామీలను ఇచ్చి మాట తప్పడంగా సాగింది అని జగన్ అన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని రుజువయ్యిందని చెప్పారు. ఏపీలో అన్ని రంగాలలో విధ్వంసానికి అరాచకానికి ప్రతిరూపంగా పాలన ఉందని అన్నారు. చంద్రబాబుకి ఓటేయడం అంటే పులి బంగారు కడియం కథలో బాటసారి లాంటిది అని తాను ఎన్నికల ముందు చెప్పాను అని గుర్తు చేశారు. ఏపీలో వైసీపీ అయిదేళ్ల పాలనలో ఇచ్చేవి వాటి కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పిన బాబు తీరా గెలిచాక మాత్రం ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని జగన్ విమర్శించారు.
మానిఫేస్టో ఎక్కడ :
ఇదిలా ఉంటే సూపర్ సిక్స్ తో పాటు మొత్తం 143 రకాల హామీలు చంద్రబాబు ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. తీరా ఎన్నికల్లో గెలిచాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని చెప్పారు. ఏపీలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా సూపర్ సిక్స్ హామీల గురించి పట్టించు కోవడంలేదని జగన్ నిందించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, యాభై ఏళ్లకే పెన్షన్ సహా అనేక హామీలను బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. ఎన్నికల హామీల గురించి అడిగితే చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని జగన్ సెటైర్లు వేశారు.
బాదుడే బాదుడు :
ఇక ఏపీలో పెట్రోలు, డీజిలు ధరలు షాక్ ఇస్తున్నాయని, అధికారంలోకి రాగానే రేట్లు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారని, మేనిఫెస్టోలో కూడా పెట్టారని జగన్ గుర్తు చేశారు. అయినా తగ్గించలేదు సరికదా చంద్రబాబు బాదుడే బాదుడే: అన్నట్లుగా రేట్లు పెంచేశారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ మీద రాష్ట్ర పన్నులను ఎందుకు తగ్గించడంలేదని ఆయన ప్రశ్నించారు. హామీల మాట పక్కన పెడితే చంద్రబాబు పలానా మంచి ప్రజలకు చేశానని చెప్పుకునే పరిస్థితిలో లేరని జగన్ ఎద్దేవా చేశారు. అందుకనే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ అన్నారు. గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని డైవర్షన్ పాలిటిక్స్కి తెలుగుదేశం పార్టీ తెర లేపిందని జగన్ అనారు.
ప్రజలు తెలివైన వారు :
అయితే బాబు ఎన్ని రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు అమాయకులు వారు కాదని, చైతన్య వంతులని జగన్ అన్నారు. ఏపీలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా అభివృద్ధి చెందిందీ అన్నా అది వైఎస్సార్ హయాంలో వైసీపీ హయాంలోనే అని జగన్ చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలు, అబద్ధాలు, అరాచకాలను ప్రజలకు వివరించేలా వారిని జాగృతపరిచేలా పార్టీ తరఫున ఈ బుక్లెట్ను రూపొందించడం జరిగిందని జగన్ చెపారు. పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ కాపీలను అందుబాటులో ఉంచుతున్నామని, పార్టీ వెబ్సైట్లో కూడా ఈ బుక్లెట్ పెడుతున్నామని జగన్ చేప్పారు. వీటిని ప్రజలలో ఉంచి ప్రచారం చేయాలని ఆయన కోరారు.
