భారతి.. క్షమాపణల కోసం డిమాండ్ ఎందుకు?
రాజకీయంగానే కాకుండా.. వైసీపీ పరంగా ఏం జరిగినా కూడా వెంటనే భారతి పేరు తెరమీదికి వస్తోంది.
By: Tupaki Desk | 9 Jun 2025 10:30 AMరాజకీయంగానే కాకుండా.. వైసీపీ పరంగా ఏం జరిగినా కూడా వెంటనే భారతి పేరు తెరమీదికి వస్తోంది. గతంలోను.. ఇప్పుడు కూడా ఆమె పేరు బయటకు రావడం గమనార్హం. మధ్యలో ఐటీడీపీ కార్యకర్త కంచర్ల శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. అయితే.. అతనిని తక్షణమే అరెస్టు చేశారు.కానీ, ఆ వెంటనే బెయిల్ కూడా వచ్చింది. ఇదిలావుంటే.. అసలు భారతిని ఇలా బయటకు తీసుకురావడంపైనా.. ఆమెపై విమర్శలు చేయడంపైనా సర్వత్రా తటస్థ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నిజానికి వైసీపీ హయాంలో కానీ.. దీనికి ముందు కానీ.. ఇప్పుడు కానీ, భారతి బయటకు వచ్చిన సందర్భం లేదు. వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగినప్పుడు కానీ.. తనపై కంచర్ల చేసిన తీవ్ర వ్యాఖ్యల సమయంలో కూడా.. భారతి బయటకు రాలేదు. ఇక, ఆడబిడ్డ.,. కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నేరుగా వదిన అంటూ.. విమర్శలు చేసిన ప్పుడు కూడా భారతి స్పందించలేదు. కేవలం ఆమె.. 2019, 2024 ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికల ప్రచారం చేశారు.
అది కూడా వైసీపీ జెండా కప్పుకోకుండానే.. పులివెందులలోనే తన భర్త, మాజీ సీఎం జగన్ తరఫున ప్రచారం చేశారు. ఇంత కుమించి ఆమె బయటకు రాలేదు. అయినప్పటికీ.. ఆమెపై విమర్శలు, వ్యాఖ్యలు.. కథనాలు ఆగడం లేదన్నది అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం.. ఇప్పుడు అప్పుడు కూడా.. విమర్శలకు అవకాశం ఇచ్చింది. ఒక విషయాన్ని ఆ విషయం పరంగానే చూసుకోవాలన్న సూచనలు కూడా వచ్చాయి. కానీ, ప్రతి విషయంలోనూ భారతిపేరును తీసుకురావడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.
ఇక, తాజాగా సాక్షి మీడియాలో అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు.. భారతి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ ఓ వర్గం తెరమీదికి తెచ్చింది. దీనిపై సాక్షి మీడియా పరంగా ప్రకటన జారీ చేశారు. కానీ, భారతి నేరుగా క్షమాపణలు చెప్పాలన్నది ప్రధాన డిమాండ్. అయితే.. ఆమె దీనికి అంగీకరించడం లేదని సమాచారం. కానీ.. ఈ దుమారం మాత్రం ఆగడం లేదు. ఒక్కడు చేసిన పనికి.. వ్యవస్థ మొత్తం ఆవేదన చెందడమే కాకుండా.. ఒక మీడియా సంస్థ కూడా ఇరుకున పడడం గమనార్హం.