Begin typing your search above and press return to search.

వైసీపీ ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం!!

చిత్రం ఏంటంటే.. ఇదేదో త‌మాషాగా తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని కొట్టిపారేయ‌లేం.

By:  Tupaki Desk   |   17 April 2024 3:30 PM GMT
వైసీపీ ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న బీజేపీ ప్ర‌భుత్వం!!
X

రాజ‌కీయాలు చిత్రంగా ఉంటాయి. వాటిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియ‌దు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు ఇత‌ర పార్టీల‌తో చేతులు క‌లిపిన బీజేపీ.. ఆదిశ‌గా అడుగులు కూడా ముందుకు వేస్తోం ది. వైసీపీ ప్ర‌భు్త్వం ఏమీ చేయ‌డంలేద‌ని.. అందుకే తాము ఇత‌ర పార్టీల‌తో చేతులు క‌లిపామ‌ని కూడా చెబుతోంది. క‌ట్ చేస్తే.. ఇదే వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని.. ఒక ప‌థ‌కంగా అమ‌లు చేస్తున్న నిర్ణ‌యాన్ని బీజేపీ అధికారంలో ఉన్న యూపీ ప్ర‌భుత్వం తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

విష‌యం చిన్న‌దే అయినా.. పెద్ద ఫ‌లితాన్ని ఇస్తుండ‌డంతో వైసీపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని యూపీలోని యోగి ఆదిత్య‌నాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం కొనియాడింది. అదే.. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ. ముఖ్యంగా ఆర్టీసీ బ‌స్సుల ద్వారా జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించేందుకు.. ఏపీ ప్ర‌భుత్వం వినూత్న ఆలోచ‌న చేసింది. డ్రైవ‌ర్ సీటు ముందు భాగంలో వారి కుటుంబ స‌భ్యుల ఫొటోల‌ను, గ్రూప్ ఫొటోల‌ను అతికిస్తున్నారు. డ్రైవ‌ర్ బ‌స్సును ఇస్టారీతిన డ్రైవ్ చేసే ముందు.. మీకో కుటుంబం ఉంది.. జాగ్ర‌త్త‌! అని హెచ్చ‌రించ‌డ‌మే దీని ఉద్దేశం.

చిత్రం ఏంటంటే.. ఇదేదో త‌మాషాగా తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని కొట్టిపారేయ‌లేం. ఎందుకంటే.. ఈ ఫొటోలు పెట్టిన త‌ర్వాత‌.. నుంచి గ‌ణ‌నీయ‌మైన మార్పు వ‌చ్చింది. రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. 2023 జ‌న‌వ‌రిలో తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఈ ఏడాది జ‌న‌వ‌రి నాటికి 5 శాతం మేర‌కు.. ప్ర‌మాదాలు త‌గ్గాయి. దీనికితోడు.. బ‌స్సులు కూడా.. రిపేర్ల‌కు రాకుండా ఉన్నాయి. ఈ విష‌యాన్ని తెలుసుకున్న యూపీ ప్ర‌భు్త్వం తాజాగా.. ఏపీలో ప‌ర్య‌టించింది.

ఇక్క‌డి ఆర్టీసీ అధికారుల‌తో భేటీ అయింది. మీ ఐడియాను మేం కూడా పంచుకుంటాం! అని చెప్పి.. ఇదే ఐడియాను యూపీలోనూ ఇంప్లిమెంట్ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని యూపీ రవాణా శాఖ కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ వెల్ల‌డించారు. ``ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధానం బాగుంది. ప్ర‌మాదాలు త‌గ్గాయి. మేం కూడా దీనిని పాటిస్తాం`` అని చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌త 2022లోనూ యూపీ ప్ర‌భుత్వం ఏపీలో ఏర్పాటు చేసిన స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను అనుస‌రిస్తున్న విష‌యం తెలిసిందే. హ‌రియాణా ప్ర‌భుత్వం వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకుంది. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇంటింటికీ.. పింఛ‌న్లు అందిస్తోంది.