Begin typing your search above and press return to search.

మళ్లీ.. మళ్లీ.. అదే ఫెయిల్యూర్ ఫార్ములా? వైసీపీ పరిస్థితి మారదా?

వైసీపీని తీవ్రంగా దెబ్బతీసిన మార్పు ఫార్ములాపై ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికీ పాఠం నేర్చుకోలేదని తాజా వ్యవహారాలు నిరూపిస్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 May 2025 12:30 PM
మళ్లీ.. మళ్లీ.. అదే ఫెయిల్యూర్ ఫార్ములా? వైసీపీ పరిస్థితి మారదా?
X

గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతారు. అయితే ప్రధానంగా అసెంబ్లీ ఇన్ చార్జులు, ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు మార్చడమే ఎన్నికల్లో బొక్కా బోర్లా పడిందని ఎక్కువగా నమ్ముతారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలపై ప్రజా వ్యతిరేకత అధిగమించేందుకు అప్పట్లో వైసీపీ మార్పు మంత్రం జపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం కొందరు ఎమ్మెల్యేలను మార్చకపోవడమే అనే విశ్లేషించారు. దీంతో అప్పటి అధికార పక్షం వైసీపీ ముందుగా అప్రమత్తమైంది. ప్రజావ్యతిరేకత అంటూ తొలుత 11 మందితో ప్రారంభించిన మార్పు.. దాదాపు 80 నియోజకవర్గాల్లో సమూలంగా ప్రక్షాళించింది. దీంతో పార్టీ క్యాడరు, నియోజకవర్గ పరిస్థితులు కూడా తెలియకుండానే చాలా మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగానే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకు పరిమితమవ్వాల్సివచ్చిందని ఇప్పటికీ చెబుతుంటారు.

వైసీపీని తీవ్రంగా దెబ్బతీసిన మార్పు ఫార్ములాపై ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికీ పాఠం నేర్చుకోలేదని తాజా వ్యవహారాలు నిరూపిస్తున్నాయని అంటున్నారు. మార్పు మార్పు అంటూ ఎన్నికల ముందు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు.. పార్లమెంటు స్థానానికి సంబంధమే లేని అభ్యర్థులను ఎంపీలుగా, ఆ నియోజకవర్గానికి సంబంధమే లేని వారిని ఎమ్మెల్యేలుగా పోటీకి పెట్టడంతో తీవ్ర నష్టం జరిగిందని అంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి అనిల్ ను మూడు జిల్లాలు దాటించి పల్నాడులోని నరసారావుపేట ఎంపీగా పోటీ చేయించడం, రాజాం ఎమ్మెల్యేగా పనిచేసిన కంబాల జోగులును 200 కిలోమీటర్ల దూరంలోని పాయకరావుపేట ఎమ్మెల్యేగా పోటీకి పెట్టడం వంటి చాలా మార్పులు వైసీపి పుట్టి ముంచాయని చెబుతారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. గతంలో జరిగిన తప్పును సవరించుకుని మళ్లీ అలాంటి పొరపాటు తలెత్తకుండా జాగ్రత్త పడతారు. కానీ, వైసీపీలో మాత్రం ఇలాంటి అంతర్మథనం మచ్చుకైనా కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఘోరంగా ఓడిపోయి, కేవలం 11 సీట్లకే పరిమితిమైనప్పటికీ వైసీపీ అధిష్టానం ఇంకా మార్పు మంత్రమే విజయతంత్రంగా పరిగణించడం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ చార్జులను నియమించిన వైసీపీ.. విఫల ప్రయోగాన్ని కొత్తగా ప్రయోగిస్తోందని అంటున్నారు.

ఇటీవల పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పార్టీలో అన్ని విభాగాలకు బాధ్యులను నియమిస్తున్నారు. అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులు, ఇన్ చార్జిలను నియమిస్తున్నారు. నరసరావుపేట పరిశీలకుడిగా విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్ గౌతంరెడ్డిని నియమించారు. అదేవిధంగా విజయవాడ, నెల్లూరు పార్లమెంటు పరిశీలకులుగా వృద్ధనేతలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జంకే వెంకటరెడ్డిని నియమించారు. నరసారావుపేటలో టీడీపీ వ్యవస్థాగతంగా బలంగా నాటుకుపోయింది. ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలంటే పార్టీలో అన్ని రకాల వ్యూహ చతురత ఉన్న నేత పరిశీలకులు లేదా ఇన్ చార్జిగా నియమించాల్సిన అవసరం ఉంది. అయితే కేవలం విజయవాడ నగర రాజకీయాలకే పరిమితమైన గౌతంరెడ్డి నరసారావుపేటను దక్కించుకునే వ్యూహం రచించగలరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అదేవిధంగా వెటరన్ పొలిటీషన్లు మోదుగుల, జంకే వెంకటరెడ్డిలను కీలకమైన విజయవాడ, నెల్లూరు నియోజకవర్గాల పరిశీలకులుగా నియమించే విషయమై పునరాలోచించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే కీలకమైన ఆ రెండు స్థానాల్లో టీడీపీ ప్రస్తుతం ఎంతో బలంగా ఉందని అంటున్నారు. టీడీపీని ఢీకొట్టడమే కాకుండా, వైసీపీని సమర్థంగా నడిపే విషయంలో ఆ ఇద్దరిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎంపీ మోదుగుల సమర్థుడైనప్పటికీ ఆయన వయసు రీత్యా గతంలో ఉన్నంత యాక్టివ్ గా పనిచేయగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అదే విధంగా నెల్లూరు విషయంలో జంకే వెంకటరెడ్డి కూడా వయోభారం వల్ల రాజకీయం చేయడం కష్టమని అంటున్నారు. దీంతో వైసీపీ తన ఫార్ములాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.