పాకిస్తాన్ ఉగ్రవాద డొల్లతనం లైవ్ లో బయటపెట్టించిన బ్రిటీష్ జర్నలిస్ట్.. వైరల్ వీడియో
ఈ సంభాషణలో హకీమ్ పాకిస్తాన్ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న వైఖరిని సూటిగా సవాలు చేశారు.
By: Tupaki Desk | 7 May 2025 11:25 AMప్రముఖ బ్రిటీష్ స్కై న్యూస్ యాంకర్ యల్దా హకీమ్ ఇటీవల పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తారర్ను ఇంటర్వ్యూ చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసుల నుండి విశేష ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా భారత్ దేశం.. పాకిస్తాన్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కీలకమైన ఇంటర్వ్యూ జరిగింది.
ఈ సంభాషణలో హకీమ్ పాకిస్తాన్ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న వైఖరిని సూటిగా సవాలు చేశారు. పాకిస్తాన్ చాలా కాలంగా ఉగ్రవాద బాధితురాలిగా ఉందని మంత్రి తారర్ పేర్కొన్నప్పుడు.. హకీమ్ వెంటనే స్పందిస్తూ పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా దశాబ్దాలుగా తమ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు అంగీకరించిన ఇటీవలి ప్రకటనను ఉదహరించారు. ఈ స్పష్టమైన వైరుధ్యంపై ఆమె నిలదీయడం ఇంటర్వ్యూలో హైలెట్ గా మారింది. పాక్ సమాచార మంత్రికి చుక్కలు చూపించింది.
అనంతరం అబోత్తాబాద్లోని సైనిక స్థావరానికి సమీపంలో ఒసామా బిన్ లాడెన్ అమెరికా బలగాల చేతిలో హతమయ్యే వరకు ఎలా గుర్తించబడకుండా నివసించగలిగాడని యాంకర్ హకీమ్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తారర్ ఆ సైనిక శిబిరం సమీపంలో లేదని చెబుతూ దూరాన్ని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించారు. అయితే ఈ వాదన ఆన్లైన్లో తీవ్ర విమర్శలకు గురైంది. చాలా మంది దీనిని దాటవేసే ప్రయత్నంగా భావించారు.
ఈ ఇంటర్వ్యూ అప్పటి నుంచి వైరల్ అయ్యింది. పాకిస్తాన్ను జవాబుదారీగా నిలబెట్టినందుకు.. ఉగ్రవాదంపై ఆ దేశం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టినందుకు చాలా మంది యాంకర్ యల్దా హకీమ్ను అభినందించారు. ఆమె కఠినమైన, సూటి ప్రశ్నలు.. పాక్ మంత్రి అస్పష్టమైన సమాధానాలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కమ్యూనిటీలో ఆమెకు విశేష ఆదరణ లభించింది.
పాకిస్తాన్ అధికారిక కథనాన్ని సమర్థవంతంగా సవాలు చేసినందుకు భారతీయ ప్రవాసులు ఆమెను ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తిస్తున్నారు. యల్దా హకీమ్ జర్నలిజం ద్వారా సత్యాన్ని బయటపెట్టే ప్రయత్నాన్ని అనేకమంది ప్రశంసిస్తున్నారు